Rains in Telangana, AP, MH: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం గంటకు 17 కిలో మీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నదని అమరావతిలో ఉన్న వాతావరణ విభాగం పేర్కొన్నది. ప్రస్తుతం వాయుగుండం పశ్చిమ బెంగాల్ కు ఆగ్నేయ దిశగా 480 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. అయితే, శనివారం రాత్రికి అది తుఫానుగా మారి ఆదివారం రోజు అర్థరాత్రి సమయంలో సాగర్ ద్వీపం నుంచి ఖేపుపారా వద్ద తీరం దాటే అవకాశముందని తెలిపింది.
అయితే, ప్రస్తుతం తుఫాను ప్రభావం కోస్తాంధ్ర తీరంపై లేదని, అయినా కూడా ఉపరితల ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత వాతావరణం పొడిగా మారుతుందని పేర్కొన్నది.
విజయవాడలో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరుగా భారీగా వచ్చి చేరింది. రహదారులు జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలోని మొఖల్రాజపురం, ఏలూరు రోడ్డు, బెంజి సర్కిల్ తదితర ప్రాంతాల్లో అయితే రోడ్లపై ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అదేవిధంగా అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడా చూసినా పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతారయం ఏర్పడింది. పలు గ్రామాల్లో వరద నీరు కారణంగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పొలాల్లో కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.