Graduate MLC By-Election Campaign has Ended: ఉమ్మడి వరంగల్-నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభుద్రల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనున్నది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాలు జూన్ 5న విడుదల కానున్నాయి.
సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగనున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఓటు కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని ఎన్నికల అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే.
కాగా, ఈ మూడు ఉమ్మడి జిల్లాలు- వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4 లక్షల 61 వేల 806 మంది గ్రాడ్యుయేట్స్.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే, అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. లక్షా 73 వేల 406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 23 వేల 985 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఇక, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్ష 66 వేల 448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లలో పురుషులే అధికంగా ఉన్నారు. సోమవారం వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ రోజు 144 సెక్షన్ అమలులో ఉండనున్నది.
Also Read: రిలీజైన విద్యా సంవత్సర క్యాలెండర్.. పాఠశాలలు ఎప్పటినుంచి ప్రారంభమంటే..?
అయితే, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి, గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఈ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం పోటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. వీరితోపాటు పలువురు ప్రముఖులు కూడా పోటీ చేస్తున్నారు.