Manish sisodia : ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఇరుపార్టీల నేతలు ఒకరిపైఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మనోజ్ తివారీ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తివారీ హెచ్చరికలను గమనిస్తే కేజ్రీవాల్ హత్యకు కుట్ర జరగుతున్నట్లు అర్థమవుతోందని మనీశ్ సిసోడియా ఆరోపించారు. విధానాల ద్వారా అరవింద్ కేజ్రీవాల్ ను బీజేపీ నేతలు ఎదుర్కొనలేకపోతున్నారని అన్నారు. ఇక ఏమీ చేయలేక హత్య చేయాలనుకుంటున్నారని సిసోడియా ఆరోపించారు.
కేజ్రీవాల్పై ఎవరైనా దాడి చేయవచ్చని ఇటీవల మనోజ్ తివారీ అన్నారు. ఆ మాటలకు అర్థమేంటని మనీశ్ సిసోడియా ప్రశ్నించారు. మనోజ్ తివారీ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామన్నారు. పోలీసు కేసు పెడతామని సిసోడియా ప్రకటించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
అటు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ మరోసారి ఆప్ నేతలపై ఎదురుదాడికి దిగారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ టికెట్లు అమ్ముకుందని ఆరోపించారు. ఆప్ నేత సందీప్ భరద్వాజ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సందీప్ భరద్వాజ్ మరణానికి కారణాలు బయటకు రావాలన్నారు. మరో 10 రోజుల్లో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, ఆప్ నేతలు పరస్పర విమర్శలతో రాజకీయాలు మరింత వేడెక్కాయి.