Wine Shops Will Close in Telangana for two days : అసలే వీకెండ్. పైన సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. ఆదివారం అలా ఇంట్లో కూర్చుని.. చల్లగా చిల్డ్ బీరో, మందో, ఇతర ఆల్కహాల్ నో వేసి.. ప్రశాంతంగా నిద్రపోదామనుకునే మందుబాబులకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం చేదు వార్త చెప్పింది. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు అన్నీ బంద్ అవ్వనున్నాయి. అయితే.. కొన్ని జిల్లాల్లో మాత్రం మద్యం దుకాణాలను మూసివేస్తున్నారు. కారణం ఏంటంటే.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక.
రాష్ట్రంలోని వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక మే 27వ తేదీన జరగనుంది. ఈ మేరకు ఇప్పటికీ సర్వం సిద్ధం చేసింది ఈసీ. శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రచారానికి తెర పడనుంది. సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకూ మద్యం దుకాణాలు, బార్లు బంద్ అవుతాయని పేర్కొందని సర్కార్. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో మద్యం షాపులు, బార్లు, వైన్ షాప్స్ బందవుతాయని స్పష్టం చేసింది.
Also Read : ఏందమ్మా ఇది.. మద్యం మత్తులో యువతీ హల్ చల్..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై.. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న (చిట్టపండు నవీన్), బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ కృషి చేస్తుండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమదే పై చేయి కావాలని కాంగ్రెస్ వ్యూహాలు రచించింది. మరి పట్టభద్రులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో చూడాలి.