Chhattisgarh Gunpowder Factory Blast(Telugu news live): ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బెమెతెరా జిల్లాలోని గన్ పౌడర్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఒకరు మరణించగా.. ఆరుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం.
భారీ పేలుడు ధాటికి చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్ని రాయ్ పూర్ ఎయిమ్స్ కు తరలించారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న రాయ్ పూర్, దుర్గ్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి.
Also Read :11కు చేరిన మృతుల సంఖ్య, ఇంకా శిథిలాల కిందే..
ప్రమాద సమయంలో గన్ పౌడర్ ఫ్యాక్టరీలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఫ్యాక్టరీ నుంచి వెలువడిన నల్లటి పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్ముకుంది. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలిపారు.
ఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణు దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల సహాయం ప్రకటించారు.