Sarfaraz Khan : ఈ ఆటగాడు ఎవరనుకుంటున్నారా? దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ రన్స్ చేస్తున్నా బీసీసీఐ కంట్లో ఇంకా పడని సర్ఫరాజ్ ఖాన్. అభిమానులు ముద్దుగా అభినవ బ్రాడ్మన్గా పిలుచుకునే ఈ ముంబై రన్ మెషీన్… తాజాగా మరో సెంచరీ బాదాడు. 2022 విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రైల్వేస్తో జరిగిన మ్యాచ్లో శతకం కొట్టి తన జట్టును గెలిపించాడు. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన రైల్వేస్… 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేయగా… ముంబై 48.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. సర్ఫరాజ్ ఖాన్ 94 బంతుల్లో 117 రన్స్ చేయగా… కెప్టెన్ అజింక్య రహానే 82 బంతుల్లో 88 రన్స్, పృథ్వీ షా 47 బంతుల్లో 51 రన్స్ చేశారు.
ఈ మ్యాచ్కు ముందు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు… సర్ఫరాజ్ ఖాన్.. చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయిన వెంటనే… ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా నేరుగా మైదానంలో అడుగుపెట్టాడు. ఆస్పత్రి బెడ్ మీది నుంచి లేచివచ్చిన మనిషి మ్యాచ్లో ఏకంగా సెంచరీ బాదడం… అభిమానులందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆట పట్ల అంకితభావానికి, క్రీడాస్ఫూర్తికి సర్ఫరాజ్ నిదర్శనమని… ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా బరిలోకి దిగడమే ఓ సాహసం అయితే… సెంచరీ చేయడం ఇంకా గొప్ప విషయం అంటూ అభిమానులు అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సర్ఫరాజ్ గురించి ఇంకా ఎక్కువ తెలిసిన వాళ్లు… టీమిండియాలో చోటు ఇచ్చే దాకా వీడు సెంచరీలు బాదుతూనే ఉంటాడని కామెంట్ చేస్తున్నారు.
సర్ఫరాజ్ ప్రతిభను ఇప్పటికైనా గమనించి… అతనికి భారత జట్టులో చోటు కల్పించాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుతున్నారు. అన్ని ఫార్మాట్లలోనూ సర్ఫరాజ్ అదరగొడుతున్నాడని… జాతీయ జట్టులో చోటు కోసం ఇంతకంటే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు అన్యాయం జరిగిందని… సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ అలా చేయొద్దని సూచిస్తున్నారు. అయితే, సెంచరీల మీద సెంచరీలు బాదుతూ టీమిండియాలో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సర్ఫరాజ్ను ఇటీవలే సెలెక్టర్లు కరుణించారు. త్వరలో బంగ్లాదేశ్తో జరగబోయే రెండు నాలుగు రోజుల మ్యాచ్ల్లో ఆడే భారత-ఎ జట్టులో సర్ఫరాజ్కు స్థానం కల్పించారు. ఆ మ్యాచ్లలోనూ సర్ఫరాజ్ చెలరేగి ఆడితే… టీమిండియాలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.