పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. నేడు తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారి ఈశాన్య రాష్ట్రాలపై విరుచుకు పడుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ తుపానుకు రేమాల్ గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఇది మే 26, ఆదివారం తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్ లోని సాగర్ దీవుల్ని, బంగ్లాదేశ్ లోని ఖేపుపరా ప్రాంతాన్ని తాకనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాల సీజన్లో ఏర్పడిన తొలి తుపాను ఇదేనని తెలిపింది. తుపాను కారణంగా ప్రాణనష్టం పెద్దగా ఉండదని అంచనా వేసింది. కానీ.. బలమైన ఈదురుగాలులు, వర్షాల ధాటికి ఆస్తినష్టం గణనీయంగా ఉండొచ్చని పేర్కొంది.
తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. మే 26,27 తేదీల్లో పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, పుర్బా మేదినీపూర్, కోల్ కతా, హౌరా, హుగ్లీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తర ఒడిశాపై కూడా తుపాను ప్రభావం ఉంటుందని తెలిపింది. అలాగే మిజోరాం, త్రిపుర, మణిపూర్ లపై కూడా తుపాను తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది. బారీ వర్షసూచన నేపథ్యంలో ఒడిశాలో నాలుగు జిల్లాలను అప్రమత్తం చేశారు అధికారులు, భద్రక్, బాలాసోర్, మయూర్ భంజ్ జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. విపత్తు దృష్ట్యా సన్నాహక చర్యలు చేపట్టారు.
బెంగాల్, ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్ లపై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
మరోవైపు కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. 220 మంది ప్రజల్ని 8 పునరావాస కేంద్రాలకు తరలించారు. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుఝా, ఎర్నాకుళం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మే 9వ తేదీ నుంచి 23వ తేదీలోగా 11 మంది వర్షాల కారణంగా మరణించారు.