ఒక టికెట్టు రూ.16.55 లక్షలండీ బాబూ.. జూన్ 5న ఇండో-పాక్ మ్యాచ్ జరగనుంది. మొదట అనుకున్న ధరల ప్రకారం 300-10,000 డాలర్ల వరకు ఉన్నాయి. కానీ మ్యాచ్ కి వస్తున్న క్రేజ్ ను చూసి ఐసీసీ డైమండ్ క్లబ్ అని ఒకటి పెట్టి, అక్కడ టికెట్ ను 20 వేల డాలర్లు రేటు పెట్టడం చూసి క్రికెట్ అభిమానులు విస్తుపోతున్నారు. అంతేకాకుండా ఐసీసీపై నెట్టింట దాడికి దిగారు. ఇలా మ్యాచ్ లు పెట్టి, డబ్బులు సొమ్ములు చేసుకోవాలని అనుకోవడం అనైతికం అని తిట్టిపోస్తున్నారు.
దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఐసీసీకి ఉన్న గౌరవాన్ని తగ్గించుకున్నట్టయ్యింది. ఆటలంటే రెండు దేశాలను కలిపేవి, వారి మధ్య సయోధ్యను కుదిర్చేవిగా ఉండాలి గానీ, కొత్త సినిమా రిలీజైనప్పుడు బ్లాక్ టికెట్లు అమ్ముకునే వారిలా వ్యవహరించకూడదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఐసీసీ లాంటి క్రికెట్ దిగ్గజ సంస్థ ఈ స్థాయికి దిగజారిపోవడం, కమర్షియల్ గా వ్యవహరించడం సరికాదని అంటున్నారు.
Also Read: ఫైనల్ కి వెళ్లేదెవరు? రేపు రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్
ఈ వ్యవహారంపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తీవ్ర విమర్శలు చేశాడు. డైమండ్ క్లబ్ లో టికెట్ ధర 20 వేల డాలర్లని తెలిసి ఆశ్చర్యపోయాను. అమెరికాలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక అగ్ర దేశంలో… ఈ ఆటను విస్తరించాలనే భావంతో చేస్తున్న ఒక మంచి ప్రయత్నమని అన్నారు. అంతేగానీ ఇంతింత టికెట్లు పెడితే ఉన్న ఆసక్తి చచ్చిపోతుందని ఘాటుగా విమర్శించారు.
ప్రపంచంలో ఇన్నిదేశాలుండగా కేవలం 10 దేశాలు మాత్రమే రెగ్యులర్ క్రికెట్ ఆడుతున్నాయి. మిగిలిన దేశాలకు కూడా క్రికెట్ ఆటను పరిచయం చేయాలి. అది వదిలేసి వచ్చిన కాడికి దండుకుందామనే పద్ధతి కరెక్టు కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇలాగైతే ప్రపంచానికి క్రికెట్ ని పరిచయం చేసే సువర్ణావకాశం మిస్ అవుతుందని విమర్శిస్తున్నారు. మొత్తానికి టికెట్ల వ్యవహారంతో ఐసీసీకి తలబొప్పి కడుతోంది.