Delhi Court Hearing kavitha’s Bail Petition on Monday: సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. పిటిషన్పై వాదనలను మే 27న వింటామని సోమవారానికి వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. జూన్ 7న ఛార్జీషీట్ ధాఖలు చేస్తామని ఈడీ కోర్టుకు వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరపున న్యాయవాది వాదనలు వినిపించేందుకు సిద్దంగా ఉన్నామని ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఆదివారం సాయంత్రంలోగా కౌంటర్ సంబంధించిన వివరాలు కవిత న్యాయవాదికి ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు కవిత. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా తనను ఈ కేసులో ఇరికించారని అందులో ప్రధానంగా పేర్కొన్నారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, దీనికితోడు మహిళ కావడంతో తనకు బెయిల్ ఇవ్వాలన్నారు. అంతేకాదు ఈడీ ఈ కేసులో ఛార్జిషీటు దాఖలు చేయడంతో తనకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదన్నారు.
Also Read: వచ్చేవారం మేడిగడ్డకు సీఎం రేవంత్
లిక్కర్ కేసులో మొదటి నుంచి సూత్రధారి కవిత అని వాదిస్తోంది ఈడీ తరపు లాయర్లు. లిక్కర్ పాలసీని తనకు అనుకూలంగా తయారు చేసేందుకు 100 కోట్ల రూపాయలను సౌత్ గ్రూప్ ద్వారా చెల్లింపులు చేయడంతో ఆమె కీలక పాత్ర పోషించారన్నది ప్రధాన పాయింట్. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాదారాలు తారుమారు అవుతాయన్నది వాదించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో ఆమె బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో మార్చి 15న హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. మార్చి 26 నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు. అయితే కింది కోర్టు జూన్ మూడు వరకు ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఏడు ఛార్జ్షీట్లను దాఖలు చేసింది ఈడీ.