Ricky Ponting, AB de Villiers opinions on Virat Kohli’s Batting Position at T20 World Cup: ఐపీఎల్ కథ దాదాపు ముగిసిపోతోంది. ఇప్పుడు అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించే ఐసీసీ టీ 20 ప్రపంచకప్ పై అందరి ఫోకస్ పడింది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియాపై కూర్పుపై మంచి డిబేట్ జరుగుతోంది. ముఖ్యంగా విరాట్ కొహ్లీని ఏ డౌన్ లో పంపించాలనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకరు ఓపెనర్ గా రావాలి అంటుంటే, మరొకరు కాదు ఫస్ట్ డౌన్ రావాలని అంటున్నారు. మరికొందరు ఎప్పటిలా మిడిలార్డర్ లో వస్తే, అక్కడ నుంచి కథంతా తాను నడిపిస్తాడని అంటున్నారు.
మరి ఎవరేమన్నారో ఒకసారి చూద్దామా.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం డీ విలియర్స్ ఏమంటున్నాడంటే.. విరాట్ కొహ్లీ ఫస్ట్ డౌన్ వస్తే మంచిదని అంటున్నాడు. ఎందుకంటే ఆల్రడీ రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ ఓపెనింగ్ కాంబినేషన్ బాగుంది. మంచి పార్టనర్ షిప్ లు వచ్చాయి. అందువల్ల యశస్వితో ఇప్పుడు ప్రయోగాలు చేయడం మంచిది కాదు కాబట్టి, కొహ్లీ ఫస్ట్ డౌన్ వస్తే కరెక్టుగా సరిపోతుందని అన్నాడు.
Also Read: కోచ్ కోసం బీసీసీఐ వేట, రిజెక్ట్ చేసిన రికీపాటింగ్!
రోహిత్-యశస్వి ఇద్దరూ పవర్ ప్లే లో ఎలాగూ షాట్లు కొడతారు కాబట్టి, ఒకరు అవుట్ అయినా, వెంటనే కొహ్లీ వచ్చి అడ్డంగా నిలబడతాడని తెలిపాడు. అలాగే తను ఒక క్లాస్ బ్యాటర్. అలాంటి వాడ్ని పట్టుకుని ఎడాపెడా కొట్టమని ఓపెనర్ గా పంపడం సరికాదని అన్నాడు. తను 4-16 ఓవర్లు ఆడాలి. నిలబడాలి. తనని అలా వాడుకోవాలి అని తెలిపాడు.
ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ ఏమన్నాడంటే, కొహ్లీని ఓపెనర్ గానే పంపాలి. ఇది టీ 20 మ్యాచ్.. 50 ఓవర్లు కాదు.. ఎవరు.. ఏ డౌను వెళ్లినా, ఫస్ట్ బాల్ నుంచి ఎటాకింగ్ చేయాల్సిందే. అందువల్ల సీనియర్ గా తను ఉంటే వికెట్లు టపటపా పడకుండా ఆగుతాయి. తర్వాత వచ్చేవాళ్లు ధైర్యంగా బ్యాటింగ్ చేయగలరని అన్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో 741 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.
ఇంత గొప్ప ఆటగాడ్ని పట్టుకుని, టీ 20 ప్రపంచకప్ కి ఎంపిక చేయాలా? వద్దా? అని ప్రజలతో సహా బీసీసీఐ కూడా ఆలోచించడం విడ్డూరంగా ఉందని చురకలు అంటించాడు.
నెటిజన్ల మాటేమిటంటే కొహ్లీ ఎప్పటిలా సెకండ్ డౌన్ రావాలి. ముందున్న వాళ్లు ఎటాకింగ్ వెళతారు. వాళ్లు త్వరగా అయిపోతే, అప్పటి నుంచి మ్యాచ్ ని కంట్రోల్ చేసి, మన వైపునకు తిప్పే మొనగాడు కొహ్లీ అని అంటున్నారు. ఒకవేళ ఓపెనర్లు క్లిక్ అయితే, తర్వాత వచ్చాక తను కూడా షాట్లు కొడతాడు కాబట్టి, బ్యాలన్స్ అవుతుందని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాల్సిందే.