Jammalamadugu Assembly constituency(AP Politics): కడప జమ్మలమడుగులో 2024 ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. వైసీపీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. కూటమి అభ్యర్ధిగా బీజేపీ నుంచి పోటీలో ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణల మధ్య జమ్మలమడుగులో గట్టి పోటీ జరిగిందంటున్నారు. సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులు మరియు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొన్ని వర్గాల్లో ఆయన వ్యతిరేకత ఉందంటున్నారు.
ఆదినారాయణ రెడ్డి.. జమ్మలమడుగు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి.. వెంటనే టీడీపీలో చేరిపోయి మంత్రి పదవి కూడా చేపట్టారు. 2019లో కడప ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన కేంద్రం అండ కోసం బీజేపీ బాట పట్టారు. ఈ సారి బీజేపీ అభ్యర్ధిగా తన సొంత నియోజకవర్గం జమ్మలమడుగు నుంచి పోటీలో నిలిచారు. ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ హయాంలో నియోజకవర్గంలో ముందుకు కదలని అభివృద్ధి.. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, స్థానికంగా ఉన్న ఆదినారాయణరెడ్డికి ఉన్న బలమైన వర్గం.. ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి.
Also Read: పాత పగలు.. కొత్త సెగలు
జమ్మలమడుగు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన డాక్టర్ సుధీర్ రెడ్డి, గడిచిన ఐదు సంవత్సరాలలో అధికారం ఉన్నప్పటికీ .. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయించలేక పోవడం మైనస్గా కనిపిస్తుంది. నియోజకవర్గంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా ,ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇలా అనేక విధాలుగా ప్రజల్ని ఇబ్బందులు గురి చేశారని ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయట.
ఆదినారాయణ రెడ్డి గతంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలవడం నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు కాస్తో కూస్తో మేలు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు నియోజకవర్గం వైసీపీలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గ్రూపులు ఉన్నాయి. అసమ్మతి నేతల్ని తనవైపు తిప్పుకోవడంలో ఆదినారాయణ రెడ్డి సక్సెస్ అయ్యారంటున్నారు. అలాగే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి .. కేంద్రం అండతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని భారీ స్థాయిలో ఇచ్చిన హామీలు జనాన్ని ప్రభావితం చేశాయంటున్నారు.
మరోవైపు ఈ నియోజకవర్గంలో చదిపిరాళ్ల కుటుంబంపై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న సానుభూతి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డికి ప్లస్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి 86.68 శాతం భారీ పోలింగ్ జరిగిన జగన్ సొంత జిల్లాలోని ఈ సెగ్మెంట్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.