హోం మంత్రి, కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత సీఎం జగన్ టీమ్లో యాక్టివ్గా ఉంటూ జగన్ క్యాబినెటలో రెండో సారి కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తానేటి వనితను తన క్యాబినెట్ లోకి తీసుకుని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఒకపక్క నియోజకవర్గం బాధ్యతలు చూసుకుంటూనే మంత్రిగా రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తూ .. తన శాఖ మీద పట్టు తెచ్చుకుని అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ జగన్ టీమ్లో మంచి పేరు తెచ్చుకున్నారు.
దాంతో మంత్రివర్గ విస్తరణలోను బెర్త్ దక్కించుకుని ఏకంగా హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. దాంతో జగన్కు వనిత ఆప్తురాలు అనే విషయం చెప్పకనే చెప్పినట్లు అయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆదేశాలతో తన సొంత నియోజకవర్గం అయిన గోపాలపురాన్ని వదిలి కొవ్వూరు నియోజకవర్గం లో పోటీ చేసి గెలుపొందారు. కొవ్వూరులో వైసీపీ కార్యకర్తలు, నాయకులు వనితకు చేదోడుగా ఉంటూ ఆమె విజయంలో కీలకపాత్ర పోషించారు.
Also Read: పాత పగలు.. కొత్త సెగలు
ఈ సారి సీట్ల కుండమార్పిడి చేసిన జగన్ గోపాలపురం ఎమ్మెల్యేని కొవ్వూరు పంపి అక్కడ నుంచి వనితను గోపాలపురం షిఫ్ట్ చేశారు. గోపాలపురం నుంచి 2009లో ఆమె టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తండ్రి జొన్నకూటి బాబాజీరావు సైతం 1994, 99 ఎన్నికల్లో గోపాలపురంలో టీడీపీ నుంచి గెలిచారు. ఆ క్రమంలో గోపాలపురంతో తనకున్న అనుబంధం, బంధువర్గం పరిచయాలతో వనిత ఈ సారి ప్రచారంలో జోరు చూపించారు. అందులోనూ సెగ్మెంట్లోని దేవరపల్లి మండలం యర్నగూడెం తానేటి వనిత స్వస్థలం కావడంతో గెలుపుపై గంపెడు అసలు పెట్టుకున్నారు.
గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ వర్గవిభేదాలు.. టీడీపీతో తన కుటుంబానికి ఉన్న అనుబంధం తనకు కలిసి వస్తాయని వనిత భావించారు. అయితే అక్కడ వర్గపోరును డైరెక్ట్ చంద్రబాబు డీల్ చేసి.. అసంతృప్తి నేతలను కూల్ చేశారు. టీడీపీ సీనియర్ నేత, జెడ్జీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన మద్దిపాటి వెంకటరాజు కి అండదండగా నిలవడం.. ఎన్నిక మొత్తం తానే అయి నడిపించడం.. జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పని చేయడం కూటమికి ప్లస్ అయిందంటున్నారు.
దాంతో ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తాననుకున్న వనిత ఆశలకు గండి పడింది. అదీకాక గోపాలపురం ఓటర్లు అర్ధరాత్రి వరకు పోలింగ్ బూత్లలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఎఫెక్ట్తో గోపాలపురం చరిత్రలోనే అత్యధికంగా 86.67 పోలింగ్ శాతం నమోదైంది. గత ఎన్నికల్లో 1,99,464 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే ఈ సారి 2,10, 399 మంది అభ్యర్ధుల తలరాతలు రాశార. దాంతో ఓటరు నాడి అంతుపట్టక అన్ని పార్టీల నేతలూ తలలు పట్టుకుంటున్నారు.
కూటమి అభ్యర్థి కొత్త కావడం , టీడీపీలో వర్గ పోరు కలిసి వస్తుంది అనుకుంటే అవన్నీ సెటిల్ అవడటంతో గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్న హోంమంత్రి తానేటి వనిత.. ఇప్పుడు టఫ్ ఫైట్ నడిచింది అని చెప్పుకొనే పరిస్థితికి వచ్చారు. గోపాలపురంలో జనసేనకు కూడా బలమైన కేడర్ ఉండటంతో ఈ సారి వైసీపీ వారిలో గందరగోళం కనిపిస్తుంది. అదీకాక గోపాలపురంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటిదాకా 9 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ ఏడు సార్లు గెలిచింది. తానేటి వనిత, ఆమె తండ్రి కూడా టీడీపీ టికెట్తోనే గోపాలపురం నుంచి ఎన్నికయ్యారు. అయితే 2009లో టీడీపీ నుంచి గెలిచిన వనిత 2012లో వైసీపీలోకి ఫిరాయించడంతో గోపాలపురం టీడీపీ శ్రేణులు ఇప్పటికీ ఆమెపై గుర్రుగా ఉన్నాయంట.
Also Read: చెవిరెడ్డి కొడుక్కి వెన్నుపోటు.. అందుకే ఆ వేటు?
అదలా అక్కడ 37 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుని మార్చి చివరి నిముషంలో తానేటి వనితను గోపాలపురానికి మార్చారు వైసీపీ అధ్యక్షుడు. దాంతో తగినంత సమయం లేక పోల్ మేనేజ్మెంట్లో ఆమె తడపడాల్సి వచ్చింది అంటున్నారు. ఇక ఈ సారి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గోపాలపురంలో ఎన్నికల ఘర్షణలు జరిగాయి. పోలింగ్కు రెండు రోజుల ముండు వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగడంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ అభ్యర్ధి మద్దిపాటి వెంకటరాజుతో కలిసి టీడీపీ నేతలు వనిత బసచేసిన ఇంటిపై దాడికి దిగారు. రెండు పార్టీల వారు పరస్పరం కేసులు పెట్టుకున్నారు.
మహిళా అభ్యర్ధి అని కూడా చూడకుండా తనపై దాడికి ప్రయత్నించారని.. జనంలో ఆ సానుభూతి పెరిగే పోలింగ్ బూత్లకు క్యూకట్టారని.. నియోజకవర్గ ఆడపడుచుగా తనను గోపాలపురం ఓటర్లు మరోసారి ఆదరిస్తారన్న నమ్మకంతో వనిత రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి గోపాలపురం ఓటర్ల జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి.