‘Will support INDIA Bloc From Says Mamata Banerjee: దీదీ మళ్లీ రాగం మార్చేశారు. ఇండియా కూటమిపై తన ప్రేమ తగ్గలేదన్నారు.. కూటమి గెలిస్తే తన మద్ధతు ఉంటుందన్నారు. ఇంతకీ మమత ఇంత అనురాగం కురిపించేందుకు రీజన్సేంటి? మొన్నటి వరకు నిప్పులు చెరిగిన ఆమే.. ఇప్పుడు ప్రేమ ఎందుకు కురిపిస్తున్నారు..? మమతా బెనర్జీ.. బెంగాల్ సీఎం.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి.. ఓ రకంగా చెప్పాలంటే బెంగాల్ శివగామి ఆమె.. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీని ఈ ఎన్నికల్లో ఎలాగైనా గద్దె దించాలని దేశంలోని దాదాపు 30 పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. మొదట్లో బలంగానే కనిపించినా.. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వీకవుతూ కనిపించింది. మొదట జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ హ్యాండిచ్చారు. ఆ తర్వాత సీట్ల వద్ద పేచీతో దీదీ కూడా కూటమికి బైబై చెప్పి వెళ్లిపోయింది. అయితే ఇదంతా పాస్ట్.. ఇప్పుడు మళ్లీ ఆమె చూపులు కూటమివైపు పడ్డాయి. ఎన్నికల్లో కూటమి గెలిస్తే తప్పకుండా బయటి నుంచి మద్ధతిస్తానని ప్రకటించింది.
మరి దీదీ దిగి రావడానికి కారణాలేంటి? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే బెంగాల్లో కాంగ్రెస్, తృణమూల్ మధ్య జరుగుతున్న ఫైట్ అంతా ఇంతా కాదు. మాటలతోనే దాడులు చేసుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు కాంగ్రెస్ కీలక నేత అయిన అధిర్ రంజన్ చౌదరీ అయితే ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయినా కూడా ఆమె కూటమిపై సానుకూలంగా ఉన్నారంటే విషయం పెద్దదే అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది. 400 సీట్లు తప్పకుండా దాటుతాయని బల్లగుద్దీ మరీ చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. అందుకే దీదీ మళ్లీ గేర్ మార్చినట్టు కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది.
Also Read: ఢిల్లీలో హై అలర్ట్.. కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు
ఇండియా కూటమికి మద్దతు అందిస్తాం. బయటి నుంచి వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తాం. ఇవీ ఎగ్జాక్ట్గా కూటమి గురించి మమత చేసిన వ్యాఖ్యలు.. అయితే షరతులు వర్తిస్తాయి అని చెబుతున్నారు ఆమె.. కూటమికి మద్ధతు కావాలంటే రెండు కండిషన్స్ పెట్టారు. ఒకటి అధిర్ రంజన్ చౌదరి నేతృత్వంలోని బెంగాల్ కాంగ్రెస్ కూటమిలో ఉండొద్దు.. రెండు.. బెంగాల్ సీపీఎం అస్సలు ఉండకూడదు. ఈ రెండు కండిషన్స్కు ఒకే అయితే తనకేం అభ్యంతరం లేదని చెబుతున్నారు మమతా.
నిజానికి కూటమి అంటేనే కాంగ్రెస్.. అందులో బెంగాల్ కాంగ్రెస్ భాగమే.. మరి బెంగాల్ కాంగ్రెస్ ఉండకూడదు అంటే వీలవుతుందా? అస్సలు కాదు. దీదీ తీరు చూస్తుంటే.. ఏదో తనంత తానుగా వెళ్లినట్టు ఉండే బాగుండదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెబుతున్నట్టుగా ఉన్నాయి ఈ మాటలు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు దశల పోలింగ్ ముగిసింది. అంటే 70 శాతం ఎన్నికలు పూర్తయ్యినట్టే.. అంటే నెక్ట్స్ దేశాన్ని ఎవరు పాలించాలో నిర్ణయం దాదాపు అయినట్టే.. అందుకే లెక్కలన్నీ వేసుకొని ఓ క్లారిటీ రావడంతోనే దీదీ టోన్ మార్చారన్న టాక్ వినిపిస్తోంది.
లేకపోతే.. మరో రెండు దశల పోలింగ్ ఉండగానే ఇలాంటి కామెంట్స్ చేసే సాహసం చేయలేరు. ఇది సాహసం అని ఎందుకు అంటున్నామంటే.. బెంగాల్లో ఉన్న 42 లోక్సభ స్థానాలకు ప్రతి దశలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమె మాట్లాడే మాటలు తర్వాత ఎన్నికలపై ఎఫెక్ట్ చూపుతాయని తెలిసి కూడా కూటమికి అనుకూలంగా మాట్లాడటం సాహసమే కదా మరి బీజేపీ ప్రచార శైలి మారడం.. దీదీ మాటలు.. చూస్తుంటే.. ముందు ముందు ఇండియా కూటమికి మంచి రోజులు ఉన్నట్టే కనిపిస్తోంది.