Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే అందం, అభినయం చూపించి స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి అని అందరిచేత అనిపించుకుంది. అనుకున్నట్లుగానే అమ్మడు వరుస సినిమా అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా నాగార్జున నుంచి నాగ చైతన్య వరకు అందరితో నటించి మెప్పించింది.
ఇక టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ కు తగ్గట్టు జీరో సైజు మెయింటైన్ చేయడంతో పాటు అందాల ఆరబోతకు సిద్దమవడంతో అక్కడ కూడా అవకాశాలు క్యూ కట్టాయి. ఛాన్స్ లు అయితే వచ్చాయి కానీ విజయాలు దక్కలేదు. కానీ, అమ్మడి ప్రేమలో మాత్రం టాప్ ప్రొడ్యూసర్ పడిపోయాడు. అతనే జాకీ భగ్నానీ. ఇక ఆ ప్రేమనే రకుల్ పెళ్లిగా మార్చుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.
స్టార్స్ గా ఉన్నప్పుడు ఎవరికైనా వివాదాలు కామనే. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ పేరు గట్టిగా వినిపించింది. దాన్ని నుంచి బయటపడడానికి ఒక పొలిటికల్ లీడర్ తో ఆమెకు ఎఫైర్ కూడా ఉందని రూమర్స్ వచ్చాయి. అతనే హైదరాబాద్ లో ఆమెకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చాడంటూ పుకార్లు షికార్లు చేసాయి. ఇక ఈ రూమర్స్ కు రకుల్ ఎట్టకేలకు సమాధానం చెప్పింది. ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో రకుల్.. ఈ బంగ్లా గిఫ్ట్ గుట్టు విప్పింది.
” సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ కామన్. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ, కొన్ని రూమర్స్ మా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని వింటుంటే నాకు కోపం వస్తుంది. నాకు ఎవరో హైదరాబాద్ లో బంగ్లా గిఫ్ట్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. నా కష్టార్జితంతో ఇల్లు కొంటే.. ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చినట్లు రాయడం ఏంటి.. ? ఈ విషయం తెలిసి మా నాన్న చాలా ఫైర్ అయ్యారు. నా కూతురు కష్టపడి ఇల్లు కొంటే.. వాడెవడో ఇల్లు గిఫ్ట్ ఇచ్చాడని రాస్తున్నారు.. నువ్వేం చేస్తున్నావ్ అంటూ నా మేనేజర్ పై అరిచారు. నేను ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ నాన్న, వదిలేయండి అని సర్దిచెప్పినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.