3 Years Old Girl Dead in Car in Bhadradri Kothagudem: కారులో ఆడుకుంటూ చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొండాయిగూడెం గ్రామంలో జరిగిందీ విషాద ఘటన. ఇంటి ముందు ఆడుకుంటూ.. ఇంటి పక్కనే నిలిపి ఉన్న కారులోకి వెళ్లింది మూడేళ్ల చిన్నారి కల్నిషా. పాప కారులోకి వెళ్లగానే ఆటోమేటిగ్గా డోర్ లాక్ అయింది. కారులో ఆడుకున్నాక బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా అది తెరచుకోలేదు.
ఆడుకుంటానని వెళ్లిన కల్నిషా ఎంతకూ రాకపోవడంతో.. తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. తెలిసిన వారిని అడిగారు. ఊరంతా గాలించారు. ఎక్కడా పాప కనిపించలేదు. చివరికి ఎందుకో అనుమానం వచ్చి.. కారు వద్దకు వెళ్లి చూడగా పాప విగతజీవిగా కనిపించింది. కారు డోర్ క్లోజ్ అవ్వడంతో.. చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. కారు సీట్లో విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
తన ముద్దు ముద్దు మాటలతో, అల్లరి చేష్టలతో తల్లిదండ్రుల్లో ఆనందాన్ని నింపే కల్నిషా.. ఇలా కారులో ఇరుక్కుని చనిపోవడంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ముసి ముసి నవ్వులతో ఓలలాడే ఆ ఇల్లు శోకసంద్రమైంది. కల్నిషాను చూసి.. గ్రామ ప్రజలు సైతం కంటతడి పెట్టుకున్నారు.