తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం.. బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడింది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ ఎల్లుండి ఉదయానికి ఇది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాత పొడి వాతావరణం కారణంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది.
ఇక తెలంగాణవ్యాప్తంగా రాగల 5 రోజుల పాటు వాతావరణంలో ఏర్పడే మార్పులపై హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో రాబోయే వారం రోజుల పాటు మిక్స్డ్ వెదర్ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఎండలు, మరికొన్ని జిల్లాల్లోనూ వానలు ఉంటాయని తెలిపింది. మంగళవారం నుంచి ఆదివారం వరకు ఆరు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇక శుక్రవారం ఉమ్మడి వరంగల్ , ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు 25న కూడా ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ , మేడ్చల్ ,మల్కాజ్ గిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని.. జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరింది.
తదుపరి 24 గంటలపాటు హైదరాబాద్ లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. దీంతో సాయంత్రం, రాత్రి సమయాల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. జూన్ 5 నుంచి 11వ తేదీ మధ్య తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి, టెన్ కాశీ, కోయంబత్తూర్, తిరునల్వేలి, తూత్తుకుడి లలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడుకు రెడ్ అలర్ట్ జారీ అయింది. చెన్నై సహా 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ వర్షానికి ఊటీలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగపడ్డాయి. సేలంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లన్నీ జలమయమవ్వడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దక్షిణ తమిళనాడులో మరో 48 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.