Tree Fell on Couple in Bollaram Hospital : ఒక్కసారి విధి రాత రాస్తే.. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని అంటుంటారు. అప్పుడప్పుడు మన కళ్ల ముందు జరిగే ఘటనలే ఇందుకు నిదర్శనం. మరణం ఎవ్వరికీ డేట్, టైమ్ చెప్పి రాదు. మన అనుకున్నవాళ్లు ఎన్నాళ్లుంటారో ఎవరికీ తెలియదు. ప్రతి క్షణం మనిషి మృత్యువుతో జీవన పోరాటం చేస్తున్నాడు. అప్పటి వరకూ మనతో ఉన్నవారు మరు నిమిషానికి ఊహించని రీతిలో చనిపోతారని ఎవరైనా అనుకుంటారా ? కలలోనైనా అలాంటి ఘటనలను ఊహించగలరా ? హైదరాబాద్ లోని బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రిలో ఇదే జరిగింది.
చికిత్స నిమిత్తం దంపతులు ఆస్పత్రికి వచ్చారు. అదే సమయంలో అక్కడున్న భారీ వృక్షం వారిపై విరిగి పడటంతో.. భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సరళాదేవికి తీవ్రగాయాలయ్యాయి. రోగానికి చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే చెట్టు రూపంలో మృత్యువు కబళించింది. తీవ్రంగా గాయపడిన సరళాదేవిని అక్కడే చికిత్స చేసి.. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. రవీందర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.
బొల్లారం ఆస్పత్రి ఆవరణలో జరిగిన ఈ ఘటనతో.. అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. సరళ దంపతుల కంటే ముందు ఒక బైక్ ఆ చెట్టు కింది నుంచే వెళ్లింది. తర్వాత వీరు ఆ మార్గంలోనే వెళ్లారు. వీరిపై విధి వక్రీకరించి.. భారీ వృక్షం కూలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.