Deputy CM Bhatti VikraMarka slams BRS: ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అయినా ఇలా అబద్ధాలు చెప్పడం మీకు అలవాటే కదా అంటూ బీఆర్ఎస్ నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసే విధంగా తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగా వర్షాలకు తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొంటుందని ఆయన తెలిపారు. 15 రోజుల నుంచే ధాన్యం కొంటున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు. ధాన్యం కొనుగోలు విషయం బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామంటూ ఆయన తెలిపారు. ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. వారి హయాంలో ఏనాడైనా తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేశారా ? అని ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోలు విషయం రైతులు ఏ మాత్రం ఆందోళన చెందొద్దని సూచించారు. చివరి గింజ వరకు కొంటామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యానికి కూడా మద్దతు ధర చెల్లిస్తామని చెప్పారు. అదేవిధంగా ధాన్యం గొనుగోలు చేసిన తరువాత మూడు రోజుల్లోనే రైతులకు డబ్బులు అకౌంట్లో జమ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షసూచన విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వాలి ఆయన పేర్కొన్నారు. సన్న ధాన్యానికి మాత్రమే రూ. 500 బోనస్ ఇస్తారంటా అంటూ విపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు విమర్శలు చేసే ముందు అసలు విషయం తెలుసుకోవాలి.. అదేమంటే రూ. 500 బోనస్ అనేది సన్న ధాన్యం నుంచి మొదలు పెట్టామంటూ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.
Also Read: సమరానికి సై అంటున్న పార్టీలు.. పట్టభద్రుల ఎన్నికలపై ఫోకస్
కాగా, సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి.. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించింది. అదేవిధంగా సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వం సన్నవడ్లకు కాకుండా దొడ్డు వడ్లకు కూడా రూ. 500 బోనస్ ఇవ్వాలని అన్నారు. దీనికి కౌంటర్ గా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ… బోనస్ సన్న వడ్ల నుంచి మొదలుపెట్టామని చెప్పారు.