కిర్గిస్తాన్ లో విదేశీ విద్యార్థులపై జరుగుతున్న హింసాకాండకు తెరపడింది. గొడవలు సద్దుమణిగాయి. వైద్య విద్యార్థులను యూనివర్సిటీలు స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నాయి. స్వదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ పేర్లను చెప్పాలని యూనివర్సిటీలు సూచించాయి. ఇంకా వారంరోజుల్లో స్వస్థలాలకు వెళ్లిపోతామని విద్యార్థులంతా ఆనందంగా ఉన్నారు. కిర్గిస్తాన్ నుంచి ఢిల్లీకి.. అక్కడి నుంచి డొమెస్టిక్ విమానాల్లో స్వస్థలాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ.. ఇంతలోనే మళ్లీ దాడులు పెరిగాయి.
పరిస్థితి అంతా సద్దుమణిగిందని ఊపిరి పీల్చుకునేలోపే.. మళ్లీ దాడులు మొదలయ్యాయి. విదేశా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసినందుకు క్షమించాలంటూ ఆ దేశ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వీడియోలు షేర్ చేశారు. కొందరు ఆకతాయిల వల్ల తమ దేశానికి చెడ్డ పేరొచ్చిందంటూ విచారం వ్యక్తం చేశారు. మిమ్మల్ని దారుణంగా హింసించడం చాలా బాధ కలిగించిందని క్షమాపణలు కోరారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ వైద్య విద్యార్థులకు ఆహారాన్ని అందించి, ఆలింగనం చేసుకుని క్షమించాలని కోరారు. ఆ దేశ అధ్యక్షుడు సైతం దాడులు ఆపాలని పిలుపునిచ్చారు. హమ్మయ్య.. అనుకున్నారంతా. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం విదేశీ విద్యార్థులపై దాడులు ఆగలేదు.
Also Read : కిర్గిస్థాన్లో ఏం జరుగుతోంది, ఆందోళనలో పేరెంట్స్, ఛానెళ్లకు వీడియోలు..
భారత్ సహా విదేశీ విద్యార్థినీ విద్యార్థులకు కిర్గిస్తాన్ లో రక్షణ లేకుండా పోయింది. వారంరోజులుగా కిర్గిస్తాన్ రాజధాని బిషెక్ లో విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నలుగురు పాకిస్థాన్ విద్యార్థులు మరణించారు. అనేకమంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో భారత ప్రభుత్వం అక్కడున్న మన విద్యార్థుల్ని అప్రమత్తం చేసింది. అధ్యక్షుడే దాడులు ఆపాలని పిలుపునిచ్చినా.. విదేశీ విద్యార్థులపై దాడులు ఆగకపోవడంపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.