Yadadri Temple Mandates New Dress Code: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు రేపటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్నాయి. యాదగిరిగుట్టతోపాటుగా పాతగుట్ట, దబ్బకుంటపల్లిలో కూడా వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ నెల 20న ఉదయం సమయంలో పుణ్యాహవచనం, స్వస్తివచనం, లక్షకుంకుమార్చన పూజలతోపాటు తిరువేంకటపతి అలంకార సేవోత్సవం కూడా నిర్వహించనున్నారు. సాయంత్రం సమయంలో అంకురార్పణ, మృత్య్సుంగ్రహం, గరుడ వాహనం, పరవాసుదేవ అలంకార సేవలు నిర్వహించనున్నారు.
మరుసటి రోజు అనగా ఈ నెల 21న ఉదయం లక్షపుష్పార్చన, కాలీయమర్ధన అలంకార సేవోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం సమయంలో నారసింహ మూలమంత్ర హవనం, పూర్ణాహుతి, గర్భాలయంలో మూలాలకు సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. రాత్రి సమయంలో నరసింహ జయంతి, ఆవిర్భావ, మహానివేదనతో ఉత్సవాలు ముగుస్తాయనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం వేసవి సెలవు రోజుల నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. ఆలయ అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Vaishakh Purnima 2024: వైశాఖ పూర్ణిమ ఉపవాసం మే 22 లేదా 23న ఎప్పుడు జరుపుకుంటారు ?
అదేవిధంగా పాతగుట్ట ఆలయంలో కూడా యథావిథిగా ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈనెల 22న దబ్బకుంటపల్లిని నరసింహస్వామి ఆలయంలో ఉదయం 11 గంటలకు స్వస్తివాచనం, అభిషేకం, స్వామివారి కల్యాణ మహోత్సవం, మహానివేదన, తీర్థప్రసాద గోష్టి ఆశీర్వాదం పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలు ఆలయ ఈవో వెల్లడించారు. ఉత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ ఈవో కోరారు.
ఆలయంలో నిబంధనలను జూన్ 1 నుంచి కఠినంగా అమలు చేస్తామని ఆలయ ఈవో పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయంలో కూడా వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలన్నారు. లక్ష్మినరసింహస్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆలయంలో నిత్య కల్యాణం, బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు ఈ నియమం వర్తిస్తుందన్నారు. వారు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తువులు ధరించాలన్నారు. సంప్రదాయ దుస్తువులు ధరించకుండా వస్తే దర్శనానికి అనుమతి నిరాకరించాల్సి వస్తదని ఆయన పేర్కొన్నారు. అయితే, నిత్యం ధర్మ దర్శనం కోసం క్యూలైన్ లో వచ్చే భక్తులకు మాత్రం ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి ఈ నిబంధన అమలు చేస్తామని ఆలయ ఈవో తెలిపారు. అయితే, డ్రెస్ కోడ్ నిబంధన విషయంలో భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు.
Also Read: తెలంగాణ కేబినెట్ భేటీకి అనుమతి ఇచ్చిన ఈసీ
అదేవిధంగా ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానంలో ఉన్న పలు శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించినట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ యేతర వస్తువులు మాత్రమే ఉపయోగించాలని సూచించిన విషయం తెలిసిందే.