Low Pressure Effect on Telugu States: మండే ఎండల నుంచి ముందస్తు వానాకాలం తెలుగు ప్రజలకు ఉపశమనాన్ని ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడటంతో.. ప్రజలకు కాస్త ఉపశమనం లభించినా.. అకాల వర్షాలు రైతన్నలకు నష్టం కలిగిస్తున్నాయి. జూన్ 5వ తేదీ తర్వాత నైరుతి ఆగమనంతో కురవాల్సిన వర్షాలు ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో.. ముందే కురుస్తున్నాయి.
ప్రస్తుతం దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, అలాగే.. ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు. ఇది మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, 24కి వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలిపారు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆదివారం సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూల్, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
Also Read: హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. మునిగిపోయిన వాహనాలు
మరోవైపు తెలంగాణలోనూ ఆకస్మిక వర్షాలు కురుస్తున్నాయి. ఉన్నట్టుండి కారుమబ్బులు కమ్ముకుని భారీవర్షం కురుస్తుండటంతో.. హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. మరో వారంరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 22వ తేదీ వరకూ.. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో ఏప్రిల్ నెలలో కాసిన రికార్డుస్థాయి ఎండల ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఇలా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 11.3 డిగ్రీల నుంచి 4.9 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు తగ్గాయి. శనివారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో అత్యధికంగా 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. నల్గొండ జిల్లా కట్టంగూరులో 6.5, సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read: Prashant kishor says ysrcp will loss: ఏపీ ఎన్నికలపై ప్రశాంత్కిషోర్, జగన్ ఓడిపోవడం ఖాయం, కారణాలు..
దక్షిణ తమిళనాడు & పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని,ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందని #APSDMA ఎండి కూర్మనాథ్ తెలిపారు.మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.ఇది మే 24 నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమై అవకాశం ఉందన్నారు.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 18, 2024