Setting up libraries in temples, ISRO Chairman Somnath advise: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ ఓ ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆయన పేరు మరోసారి దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. మంచి ఉపాయం చెప్పారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా ఇలా చేస్తే యువతకే కాదు.. ఎందరికో ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంతకు ఆయన ఏం చేశారు అని అంటారా..? అయితే, ఇది ఈ వార్త చదవండి.
కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ ఉడియన్నూర్ దేవీ ఆలయ సభ్యులు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ అవార్డు ప్రదానం చేశారు. అనంతరం సోమనాథ్ మాట్లాడారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి చాలామంది యువకులు వస్తారని తాను అనుకున్నారని, కానీ వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. అయితే, ఆలయ నిర్వాహకులు యువతను దేవాలయాల వైపు ఆకర్శించేందుకు కృషి చేయాలన్నారు. ఇందుకోసం తాను ఓ ఆసక్తికరమైన విషయం చెబుతానని చెప్పారు. దేవాలయాల్లో లైబ్రరీలను ఎందుకు ఏర్పాటు చేయకూడదంటూ? ఆయన పేర్కొన్నారు.
దేవాలయాలు కేవలం వృద్ధులు వచ్చి దేవుడిని తలుచుకునేవిగానే కాకుండా సమాజాన్ని మార్చేటువంటి అత్యంత ప్రభావవంతమైన ప్రదేశాలుగా మారాలని సోమనాథ్ అన్నారు. ఆలయాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేస్తే ధార్మిక విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు, ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనుకునేవారు ఇక్కడికి రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారని ఆయన పేర్కొన్నారు. ఆలయ నిర్వాహకులు ఆలయాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేసే దిశగా ముందడుగు వేస్తే సమాజంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా సాయంత్రం సమయాల్లో వివిధ పలు అంశాలపై చర్చలు ఏర్పాటు చేయాలన్నారు. అలా చర్చలు ఏర్పాటు చేస్తే యువకులు తమ అభివృద్ధికి బాటలు వేసుకునేందుకు దోహదపడినట్లవుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా సోమనాథ్ చేసిన ఆసక్తికర సూచనపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి సలహా ఇచ్చారంటూ సోమనాథ్ పై మరోసారి దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా ఆలయ నిర్వాహకులు ఆ దిశగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అలా వెళితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
1985లో ఇస్రోలో చేరిన సోమనాత్ అంచెలంచెలుగా ఎదిగి ఇస్రో చైర్మన్ స్థానానికి ఎదిగారు. కేరళకు చెందిన సోమనాథ్ మెకానికల్ ఇంజనీరింగ్ లో యూజీ డిగ్రీని పూర్తి చేశారు. అదేవిధంగా భారతదేశం నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా ఆయన మాస్టర్స్ పూర్తి చేశారు. రాకెట్ ఇంజనీరింగ్ మరియు లాంచింగ్ వెహికిల్స్ డిజైనింగ్ లో అతనికి నిపుణుడిగా మంచి గుర్తింపు ఉంది. చంద్రయాన్-3తోపాటు ప్రతిష్మాత్మకమైన ప్రాజెక్టులుగా భావించే ఆదిత్య ఎల్-1, గగన్ యాన్ వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్లలో ఈయన కీలకం.
Also Read: ఆ సంఘటన నన్ను షాక్కు గురిచేసింది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
ఇస్రో చరిత్రలోనే అత్యంత భారీ ప్రయోగం, క్లిష్టమైన ప్రయోగం చంద్రయాన్-3. అయితే, ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యా మాత్రమే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. చంద్రయాన్ -3 ను దక్షిణ ధృవం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ చేసి భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు రూపకల్పనలో సోమనాథ్ కీలకంగా పనిచేసిన విషయం విధితమే.