Kejriwal’s aide Bibhav Kumar Arrest: ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. తాజాగా ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు వ్యవహారం కొత్త మలుపులు తిరిగింది.
సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం ఇంటి వెనుక నుంచి మూడో కంటికి కనపడకుండా తీసుకెళ్లారు. అక్కడి నుంచి సంబంధిత సివిల్ లైన్ పోలీసుస్టేషన్కు తరలించారు. ఆయన్ని అక్కడ విచారిస్తున్నారు. అనంతరం తీస్ హజారీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.
ఇదిలావుండగా బిభవ్ అరెస్ట్ విషయం తెలియగానే ఎంపీ రాఘవ్ చద్దా సివిల్ లైన్ పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. కాకపోతే మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. అరెస్ట్కు ముందు ఈ కేసు దర్యాప్తులో సహకరించడానికి తాను సిద్ధంగా ఉంటానని బిభవ్ ఢిల్లీ పోలీసులకు ఈ-మెయిల్ చేశారు. ఈ తతంగం జరిగిన కొద్దిసేపటికే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో దాడికి సంబంధించిన మరొక వీడియో వెలుగులోకి వచ్చింది. సీఎం ఇంటి నుంచి భద్రతా సిబ్బంది స్వాతిని బయటకు పంపిస్తున్నట్లు అందులో ఉంది. ఆమె బయటకు వచ్చే సమయంలో మహిళ సెక్యూరిటీ చేయి పట్టుకున్నట్లు కనిపించారు. రోడ్డుకు వచ్చిన తర్వాత మహిళా పోలీసుతో స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఓ పోలీసు అధికారి వచ్చి స్వాతిమాలివాల్తో మాట్లాడడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ALSO READ: ఆప్లో చీలిక ఖాయమా? స్వాతి మలివాల్ కేసులో న్యూట్విస్ట్!
సీఎం కేజ్రీవాల్ ఇంటిలో ఈ వ్యవహారానికి సంబంధించి రోజుకో వీడియో వెలుగులోకి రావడంతో ఆప్ నేతలు షాకయ్యారు. ఇంతకీ ఈ వీడియోలు ఎక్కడ నుంచి బయటకు వస్తున్నాయి. ఇష్యూని పెద్దది చేయాలనే ఇదంతా చేస్తున్నారా? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆప్ నేతల దృష్టంతా బీజేపీపైనే ఉంది.