మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన ఒక భూమి కోర్టు వివాదంలో ఉంది. కోర్టులో కేసు నడుస్తుండగానే.. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి.. కొందరు స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ.. అక్కడ ఉన్న బారికేడ్లను తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడున్న వారితో మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు వాగ్వాదానికి దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు.
సుచిత్ర వద్ద సర్వే నంబర్ 82లో రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఆ భూమి తమదేనని మల్లారెడ్డి పేర్కొనగా.. మరో 15 మంది అందులో 1.11 ఎకరం భూమి తమకు చెందిందని, ఒక్కొక్కరం 400 గజాలు కొనుక్కున్నామని పోలీసులకు చెప్పారు. దీనిపై కోర్టు తమకు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చిందన్నారు. అయితే.. ఈ సమస్యను ఇరు వర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించగా.. మల్లారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Also Read : ఆ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్.. జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచన
పోలీసుల మాటను పట్టించుకోకుండా.. ఫెన్సింగ్ తీయండి అని తన అనుచరులకు చెప్పారు. తనపై కేసు పెట్టినా ఫర్వాలేదని, తన స్థలాన్ని కాపాడుకుంటానన్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఈ క్రమంలో పేట్ బషీరాబాద్ పోలీసులు మల్లారెడ్డిని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా.. మల్లారెడ్డి అరెస్ట్ పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.