Man kills Mother and Daughters for Asset : మంచికి, మానవత్వానికి రోజుల్లేని జనరేషన్ ఇది. చిన్న చిన్న కారణాలకే అయినవారిని అనంతలోకాలకు పంపుతున్నారు. ఆస్తి తగాదాలు, అనుమానాలు, ప్రేమలు, కులాంతర – మతాంతర వివాహాలు.. ఇలా రకరకాల కారణాలతో ఎందరో హత్యకు గురవుతున్నారు. ఆస్తికోసం కన్న తల్లిని, కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్లను కడతేర్చాడో కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి తన తల్లి పిచ్చమ్మ (60)తో ఆస్తి తగాదాలున్నాయి. ఈ క్రమంలోనే కోపంతో తల్లిని గొంతు నులిమి హతమార్చాడు. ఆపె ఇద్దరు కూతుళ్లు నీరజ (10), ఝాన్సీ(6)లను కూడా చంపి పరారయ్యాడు. తల్లి పేరుపై ఉన్న పొలంను తన పేరుపై రాయాలని కొన్నాళ్లుగా వేధిస్తున్నట్లు తెలిసింది. అందుకు ఆమె ససేమిరా కుదరదని చెప్పడంతో.. వెంకటేశ్వర్లు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
Also Read : భర్తను చంపేసి, హార్ట్ ఎటాక్ అంటూ.. అడ్డంగా బుక్కైన వైఫ్
కాగా.. స్థానికులు చెప్పిన దానిప్రకారం వెంకటేశ్వర్లుకు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. రెండేళ్ల క్రితం భార్యను కూడా అతనే చంపినట్లు పోలీసులకు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపిన పోలీసులు.. హత్యలపై కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న వెంకటేశ్వర్లు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.