Swati Maliwal Assault case update(Telugu news live): ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలే ఉత్తరాదిలో ఎన్నికల వేడి.. స్వాతి కేసు వైపు టర్న్ అయ్యింది. అంతేకాదు మీడియా అటెక్షన్ కూడా డైవర్ట్ అయ్యింది. అందరిచూపు ఈ కేసుపైనే పడింది. ఈ పరిస్థితి గమనించిన వాళ్లకు మాత్రం ఆప్లో చీలిక వస్తుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయంలో సీఎం కేజ్రీవాల్ సైలెంట్గా ఉండడం, పోలీసులే స్వయంగా రంగంలోకి దిగడం వంటి పరిణామాలు చీపురు పార్టీని బాగానే ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఢిల్లీ సమాచారం.
ఇదిలావుండగా సోమవారం ఎంపీ స్వాతి మలివాల్.. సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినప్పుడు అక్కడి సెక్యూరిటీ ఆమె వాగ్వాదానికి సంబంధించిన 52 సెకన్ల నిడివి గల వీడియో తెగ హంగామా చేస్తోంది. దీంతో ఆ రోజు ఏం జరిగిందనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో స్వాతి స్పందించారు. రాజకీయ హిట్మాన్ తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారామె. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నదానిపై నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నారు.
బయటకు వచ్చిన వీడియోపై ఆప్ నేతలు స్పందించారు. తనను కొట్టారని స్వాతి చేసిన ఆరోపణలకు అందుకు భిన్నంగా వీడియో ఉందంటున్నారు. సెక్యూరిటీని స్వాతి బెదిరిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఆమె ఆరోపణలకు భిన్నంగా ఉందన్నారు. సీఎం కేజ్రీవాల్ అపాయింట్మెంట్ లేకుండా స్వాతి ఆయన ఇంట్లోకి ప్రవేశించారని చెప్పుకొచ్చారు. సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్కుమార్, ఆమెని అడ్డుకున్నారు. కానీ డ్రాయింగ్ రూమలో ఆమె ఆర్గ్యుమెంట్ చేయడం జరిగిందని మంత్రి అతిషి చెప్పుకొచ్చారు. స్వాతి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కేజ్రీవాల్కు బెయిల్ రావడంతో బీజేపీ ఉలిక్కిపడిందని, ఈ విధంగా కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ క్రమంలో ఎంపీ స్వాతిని పావుగా వినియోగించుకున్నారన్నది ఏఏపీ మాట.
ఇక పోలీసు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తన చెంపపై ఎనిమిదిసార్లు కొట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు స్వాతి మలివాల్. డ్రాయింగ్ రూమ్లో తాను ఎదురు చూస్తుంటే బిభవ్ దూసుకొచ్చారని, అరిచి తనను నానా మాటలు అన్నారని ఆరోపించారు. ఈ క్రమంలో తనను తాను రక్షించేందుకు ఆయన్ని కాళ్లతో తోసినట్టు ఎఫ్ఐఆర్లో ఉంది.
ALSO READ: నిందితుల జాబితాలో ఆప్.. కోర్టుకు తెలిపిన ఈడీ..
ఆ సమయంలో కుమార్ తనపై పడ్డారని, కాళ్లతో ఛాతీ, పొట్టలో తన్నినట్టు పేర్కొన్నారు స్వాతిమలివాల్. సాయం కోసం అరుస్తున్నా తనను ఎవరూ కాపాడే ప్రయత్నం చేయలేదన్నారు. తనను కుమార్ బెదిరించారని ప్రస్తావించారు. తాను తీవ్రంగా దెబ్బలు తిన్నానని, పీసీఆర్ వ్యాన్ వచ్చే వరకు ఉండాలని కోరానని, చివరకు సిబ్బంది సాయంతో ఆటో ఎక్కినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు శుక్రవారం ఆమె న్యాయస్థానంలో మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు ఎంపీ స్వాతి. అందుకుముందు సీఎం కేజ్రీవాల్ నివాసానికి పోలీసులు వెళ్లారు. మొత్తానికి ఉత్తరాదిలో ఎన్నికలు ఏమోగానీ, స్వాతి వ్యవహారంపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
स्वाति मालीवाल के आरोपों की असलियत उजागर कर रहा है ये वीडियो 👇🏻 pic.twitter.com/dBkH5YhKdD
— AAP (@AamAadmiParty) May 18, 2024