MI vs LSG match highlights(Sports news today): ఐపీఎల్ సీజన్ 2024లో ముంబైకి ఏ మాత్రం కలిసి రాలేదు. మొదలైన దగ్గర నుంచి అన్నీ తలనొప్పులే. మొత్తానికి కెప్టెన్ మార్పు ఆ జట్టు ఆత్మనే చంపేసిందనే టాక్ వచ్చింది. అదే శుక్రవారం మ్యాచ్ ఫలితాల్లో రుజువైంది. అట్టడుగు స్థానంలోనే ఉండిపోయింది. ఇందులో హార్దిక్ పాండ్యా తప్పు లేదు కానీ, ఫ్రాంచైజీ అత్యుత్సాహం ఆ జట్టుని అధ: పాతాళానికి తొక్కేసింది. ఇకపోతే వాంఖేడి స్టేడియంలో లక్నో తో జరిగిన ఆఖరి మ్యాచ్ లో ముంబై 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగు ప్రారంభించిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లక్ష్య సాధనలో ముంబై 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. చివరికి 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
వివరాల్లోకి వెళితే.. 215 టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకి శుభారంభం దక్కింది. ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ చేశాడు. తనకి తోడుగా బ్రేవిస్ వచ్చాడు. ఇద్దరూ మంచి రిథమ్ తో బ్యాటింగ్ చేస్తుండగా 3.5 ఓవరు దాటాక వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది. మళ్లీ 10.30 సమయంలో తిరిగి ప్రారంభమైంది.
తర్వాత కూడా రోహిత్ శర్మ ఎక్కడా తగ్గలేదు. 38 బంతుల్లో 3 సిక్స్ లు, 10 ఫోర్ల సాయంతో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ బ్రెవిస్ (23) తను కూడా అయిపోయాడు. ఈ సమయంలో ఫస్ట్ డౌన్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. దీంతో ముంబై ఆశలు నీరుగారిపోయాయి.
Also Read : పూరన్కు అర్జున్ టెండూల్కర్ భయపడ్డాడా? అది ఫేక్ గాయమా?
దీంతో ఇషాన్ కిషన్ సెకండ్ డౌన్ వచ్చాడు. తను కూడా ఎక్కువసేపు నిలవలేదు. కేవలం 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చి కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ 16 పరుగుల వద్ద అయిపోయాడు. తర్వాత నెహాల్ వధేరా (1) తను అయిపోయాడు.
అప్పుడు ఒకడు వచ్చాడు. అతను నమన్ ధీర్ . మామూలుగా ఆడలేదు…లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 28 బంతుల్లో 5 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కాకపోతే తనకి సపోర్టుగా ఎవరూ లేకపోవడంతో అవతలి ఎండ్ లో ఒంటరిగా ఉండిపోయాడు.
మొత్తానికి 20 ఓవర్లలో 196 పరుగుల వద్ద ముంబై కథ ముగిసిపోయింది. 18 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. ఒక్క ముక్కలో చెప్పాల్సి వస్తే, ఐపీఎల్ సీజన్ 2024 నుంచి అత్యంత బాధాకరంగా ముంబై బయటకు వచ్చింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో అలాగే ఉండిపోయింది. నిజంగా ముంబై జట్టుకి తలకొట్టీసినట్టయ్యింది.
లక్నో బౌలింగులో కృనాల్ పాండ్యా 1, మొహ్సిన్ కాన్ 1, నవీన్ ఉల్ హక్ 2, రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇక ఫస్ట్ బ్యాటింగు చేసిన లక్నో ఓపెనర్ గా కేఎల్ రాహుల్ తో కలిసి దేవదత్ పడిక్కల్ వచ్చాడు. కానీ గోల్డెన్ డౌకౌట్ గా వెనుతిరిగాడు. అలా మొదలైన లక్నో జట్టుని కెప్టెన్ రాహుల్ ఆదుకున్నాడు. 41 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు.
తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ పెద్దగా ప్రభావం చూపించలేదు. మార్కస్ స్టోనిస్ (28), దీపక్ హుడా (11) చేసి అవుట్ అయ్యారు. అప్పుడు వచ్చాడు నికోలస్ పూరన్ ఇరక్కొట్టి వదిలాడు. 29 బంతుల్లో 8 సిక్స్ లు, 5 ఫోర్లతో 75 పరుగులు చేశాడు. ఇవే మ్యాచ్ కి ఆయువు పట్టుగా మారాయి. తర్వాత అర్షాద్ ఖాన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆయుష్ బదానీ (22), కృనాల్ పాండ్యా (12) నాటౌట్ గా నిలిచారు. మొత్తానికి 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంతో సరిపెట్టుకుంది.
ముంబై బౌలింగులో నువాన్ తుషారా 3, పియూష్ చావ్లా 3 వికెట్లు పడగొట్టారు.