Monsoon Updates for Andhra Pradesh and Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఓ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా మరికొన్ని చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని ఈశాన్య మరియు తూర్పు జిల్లాలు, వాటితోపాటు వాటి చుట్టుపక్కల ఉన్న కొన్ని జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందని పేర్కొన్నది. అదేవిధంగా దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నాలుగైదు రోజులపాటు వర్షం కురిసే అవకాశముందని పేర్కొన్నది.
శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఈ సమయంలో పిడుగులు పడే అవకాశం లేకపోలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా మరోవైపు రాష్ట్రంలో నాలుగైదు రోజులపాటు పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది.
Also Read: CM Jagan in London: లండన్లో సీఎం జగన్, కాకపోతే..
అయితే, గురువారం రాష్ట్రంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ నగరం తడిసిముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి. డ్రైనేజీలు, నాలాలు వరద నీటితో నిండిపోయాయి. పలు చోట్లా అయితే వరద నీటితో రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లపై వరద నీరు వచ్చి చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈదురుగాలులు వీయడంతో పలు చోట్లా చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సంబంధిత డిపార్ట్ మెంట్ల్ సిబ్బంది పరిస్థితులను చక్కదిద్దిన విషయం తెలిసిందే.
హఠాత్తుగా భారీగా వర్షం రావడంతో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు, రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందారు. రాష్ట్రంలో నల్లగొండ జిల్లా కనగల్ లో అత్యధికంగా వర్షం పడింది. 10.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఖైరతాబాద్ లో 9 సెంటిమీటర్ల వర్షపాతం, షేక్ పేట-8.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో 6.7 నుంచి 9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
Also Read: ఆ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్.. జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచన
ఇటు ఏపీలోనూ మరో ఐదురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల సంస్థ తెలిపిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇటు కేరళ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లను జారీ చేసింది. మలప్పురం, పాలక్కాడ్, పతనంతిట్ట, అలప్పుజా, ఇడుక్కి, కొల్లాం, తిరువనంతపురం, పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకలలంతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.