Andhra Pradesh Polling Percentage in Elections 2024: పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేసింది. గెలుపు మాదంటే మాదని అధికార, ప్రతిపక్షాలు ఊదరగొట్టేస్తున్నాయి. పోలింగ్ తర్వాత తొలిసారి స్పందించిన జగన్ గతం కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు సైలెంట్ అయిన వైసీపీ నేతలు కూడా జగన్ రియాక్ట్ అవ్వగానే ఒకొక్కరుగా బయటకు వచ్చి గెలుపు మంత్రం పఠిస్తున్నారు. దాంతో కూటమి నేతలు వైసీపీని టార్గెట్ చేస్తూ సెటైర్లు మెుదలుపెట్టారు. మరి పోటెత్తిన ఏపీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో కానీ.. విక్టరీ మాదంటే మాదంటున్న నేతల డైలాగ్ వార్తో బెట్టింగ్ బాబులు చెలరేగిపోతున్నారు.
ఏపీలో రికార్డ్ స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. 1952 తర్వాత రాష్ట్రంలో ఇదే అత్యధిక పోలింగ్ శాతమని సీఈఓ వెల్లడించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఓటింగ్ శాతం పెరిగితే అధికార పార్టీ గెలిచిన దాఖలాలు మచ్చుకైనా లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. 2014లో 74.68 శాతం పోలింగ్ జరిగినప్పుడు ఎన్డీఏ కూటమి అధికారపగ్గాలు చేపట్టింది. గత ఎన్నికల్లో అది పెరిగి 79 శాతానికి చేరి వైసీపీ పగ్గాలు చేపట్టింది. తాజా ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో 81.86 పోలింగ్ శాతం నమోదైంది .. ఆ లెక్కలతో ఇప్పుడు అధికార పక్షానికి ఎలా మేలు జరుగుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వై నాట్ వన్ సెవంటీ ఫైవ్ స్లోగన్ ఎత్తుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్. అందులోనే వైనాట్ కుప్పంను కూడా యాడ్ చేశారు. అయితే ఎన్నికలు సమీపించే నాటికి ఎన్డీఏ కూటమి ఏర్పడటం.. రాష్ట్రంలో కీలక అధికారుల మార్పులు చేర్పులు వంటి పరిణామాలతో జగన్ టెన్షన్ పడినట్టు కనిపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పట్టుదలతో మిత్రపక్షాలు సైతం పట్టువిడుపులకు పోయి పొత్తు ధర్మం పాటించాయి. అయినా నవరత్నాలపై నమ్మకంతో జగన్ తన వన్ సెవెన్టీ ఫైవ్ స్లోగన్ మాత్రం వదలలేదు.
Also Read: SIT primary inquiry on five areas: సిట్ ఎంక్వైరీ, ఆ ప్రాంతాల్లో టూర్, నేతలను అరెస్ట్ చేసే ఛాన్స్?
పోలింగ్ శాతం పెరగడంతో ప్రభుత్వ వ్యతిరేకత స్ఫష్టమైందని.. కూటమి నేతలు ఆ రోజు నుంచే ప్రచారం చేసుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన మూడు రోజులకు బయటకు వచ్చిన సీఎం జగన్ ఐప్యాక్ టీంను కలిసారు. వైసీపీకి రాజకీయ, ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ ప్రతినిధులతో విజయవాడలోని ఆ సంస్థ కార్యాలయంలో జగన్ భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైసీపీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ప్రశాంత్కిషోర్ వైసీపీ వ్యూహకర్తగా వ్యవహరించారు … అయితే ఈ సారి ఆయన వైసీపీ గెలవడం కష్టమని రెండు నెలల ముందే ప్రకటించారు.
గత ఎన్నికల్లో గెలవగానే పీకేను కలిసి అభినందనలు చెప్పి వచ్చారు జగన్. అయితే పీకే ఈసారి వైసీపీకి పనిచేయలేదు. ఆయన శిష్యబృందం ఐ-ప్యాక్ టీంగా ఏర్పడి వైసీపీని గైడ్ చేసింది. గత సెంటిమెంట్నే కొనసాగిస్తూ ఐప్యాక్ బృందాన్ని కలిసిన జగన్ … ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నామని జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాలతో దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 151కి పైగా అసెంబ్లీ స్థానాల్లో, 22కి పైగా లోక్సభ సీట్లలో గెలిచి చరిత్ర సృష్టిస్తామని ఇంగ్లీషులో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లోనూ వైసీపీ, ఐ-ప్యాక్ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. ప్రశాంత్ కిశోర్ ప్రత్యర్థి వైపు వెళ్లి మాట్లాడుతున్నారని విమర్శించారు.
Also Read: AP Govt. forms SIT on Violence: ఏపీలో హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు..!
జగన్ ఇంగ్లీషులో మాట్లాడుతున్నప్పుడు పక్కనే నిల్చున్న మంత్రి బొత్స సత్యనారాయణ.. ఆ వెంటనే మీడియా ముందుకొచ్చారు. 170కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తామంటున్న బొత్స .. విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని జోస్యం చెప్తున్నారు.
జగన్ స్టేట్ మెంట్ తర్వాత తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వైసీపీ నేతలు కొందరు కూడా వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టీడీపీ నేతలు సీన్లోకి వచ్చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ నమ్మకం చూస్తుంటే కేఏ పాల్ గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీ ఉట్టి ముంచిందని విమర్శించారు.
Also Read: ఏపీలో ఎందుకీ రాజకీయదాడులు.. అసలు కారకులెవరు..?
మరోవైపు రాబోయే ఎన్నికల్లో ఒకవేళ వైసీపీ గెలవకపోతే.. జగన్ పార్టీనీ మూసేస్తావా.. అని టీడీపీ నేత బొండా ఉమా సవాల్ విసిరారు. జగన్ ఐ-ప్యాక్ టీం దగ్గరకు వెళ్ళి ఓదార్పు యాత్ర చేశారని జూన్ 4న దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని జగన్ అంటున్నారని… అది నిజమే కానీ జగన్కి సింగిల్ డిజిట్ వచ్చేది చూస్తారని ఎద్దేవా చేశారు. ఈ జగన్ కి సహకరించిన అధికారులు కూటమి అధికారంలోకి వచ్చాక జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.
మొత్తమ్మీద నేతల ధీమా , వరుస స్టేట్మెంట్లతో ప్రజల్లో మాత్రం తీవ్ర గందరగోళం కనిపిస్తుంది. జగన్ మాటలు బెట్టింగ్ రాయుళ్ల కోసమా లేక కార్యకర్తల్లో మనోధైర్యం కోసమా అర్థం కావట్లేదు అంటున్నాయి వైసీపీ శ్రేణులు పోలింగ్ పర్సంటేజ్ 81.86.. అంటే టోటల్ 23, దాన్ని సెంటిమెంటుగా చూపిస్తూ పందాలకు సిద్దమవుతున్నారు వైసీపీ నేతలు ఏదైతేనేం అధికార ప్రతిపక్ష మాటలు నమ్మి కోట్లల్లో బెట్టింగ్స్కు దిగుతున్నారు పందెంరాయుళ్లు. మరి చివరికి రోడ్డున పడేదెవరో చూడాలి.