11 Dead in West Bengal due to Rain Lightning Strikes: పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో గురువారం మధ్యాహ్నం వర్షంతో పాటు పడిన పిడుగుల వర్షంలో 11 మంది మరణించగా.. అనేక మంది గాయపడినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. హరిశ్చంద్రాపూర్ లో పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. పొలంలో పనులు చేస్తుండగా పిడుగు పడగా.. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మృతులు నయన్ రాయ్ (23), ప్రియాంక సింగ్ (20)గా గుర్తించారు.
అలాగే.. మాల్దాలోని సహపూర్ ప్రాంతంలో చందన్ సహాని (40), రాజ్ మృద్ధా (16), మనజిత్ మండల్ (21), అసిత్ సాహా (19) పిడుగుపాటుకు మరణించారు. మానిక్ చక్ లోని మహ్మద్ తోలాలో ఎనిమిదేళ్ల రాణా షేక్, హద్దటోలాలో అతుల్ మండల్ (65), షేక్ సబ్రుల్ (11), మిర్దార్ పూర్ లో సుమిత్ర మండల్ (45) ప్రాణాలు కోల్పోయారు. ఇంగ్లీషు బజార్ లోని మిల్కీలో పంకజ్ మండల్ (23) అనే వ్యక్తి కూడా మరణించాడు. అనేక మంది గాయాలపాలై చికిత్స పొందుతున్నారు.
Also Read: Bus catches fire in Haryana: హర్యానాలో ఘోరం, మంటల్లో బస్సు.. 10మంది సజీవ దహనం
పిడుగుపాటుకు ఇంతమంది మరణించడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఒక్కో మృతుని కుటుంబాలకు జిల్లా యంత్రాంగం రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందని సీఎం మమతా తెలిపారు.