Jagan Meets I-Pac Team: ఏపీలో ఎన్నికల రణరంగం ముగిసింది. హోరాహోరీ పోటీలో నెగ్గేదెవరో.. వెనుదిరిగేదెవరో జూన్ 4న తేలిపోనుంది. ఫలితాలకు ఇంకా రెండు వారాలకు పైగానే సమయం ఉంది. కాగా.. ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ఐ ప్యాక్ టీమ్ ను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం కలిశారు. టీమ్ సభ్యులతో మాట్లాడిన ఆయన.. ఏపీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించారు.
వైసీపీ విజయానికి కృషి చేసిన ఐప్యాక్ టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. జూన్ 4న వెలువడే ఏపీ ఎన్నికల ఫలితాలను చూసి దేశమంతా షాకవుతుందన్నారు. 2019లో వచ్చినదానికంటే అత్యధిక సీట్లు, అత్యధిక మెజార్టీ వస్తుందని పేర్కొన్నారు. ఏపీ ఫలితాలను ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించరని, ఆయన ఊహకు మించిన సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 22 ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనేనన్న జగన్.. ఈసారి గతంలోకంటే మరింత మెరుగైన పాలనను అందిస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రజలకు మరింత మేలు చేస్తామని, మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. వైసీపీ గెలుపు తథ్యమని, భవిష్యత్ లో మరోసారి ఐప్యాక్ టీమ్ తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.
Also Read: అందుకేనా.. ఐ’ప్యాక్’ ఆఫీసుకు సీఎం జగన్
2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచిన తాము.. ఈసారి అంతకుమించిన సీట్లలో విజయం సాధిస్తామన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత యావత్ దేశం ఏపీవైపే చూస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఐప్యాక్ తో వైసీపీ జర్నీ ఇలాగే కొనసాగుతుందన్నారు.