Update on Medigadda Barrage Repair Work: మేడిగడ్డ బ్యారేజీ.. సరిగ్గా గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద శబ్ధంతో కుంగిపోయింది. అప్పటివరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరాజయానికి ఇదీ ఒక కారణం. ప్రాజెక్టుల పేరుతో నిధులు దండుకుని.. నాసిరకం నిర్మాణాలు చేశారని ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తింది కాంగ్రెస్. మేడిగడ్డ కుంగుబాటే.. కాంగ్రెస్ కు ప్రధాన విజయాస్త్రమైంది. ఇదంతా ఓకే. బ్యారేజీ కుంగిపోయి ఆర్నెల్లైంది. ఇంతవరకూ తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేదు. ఇది చేయాల్సింది ప్రభుత్వమే అని ఎల్ అండ్ టీ సంస్థ అంటుంటే.. చట్టప్రకారం వెళ్దామని నీటి పారుదల శాఖ అంటోంది.
మరో రెండువారాల్లో వర్షాకాలం మొదలు కాబోతోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చేసరికి మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు పూర్తవ్వాలి. లేదంటే నష్టం చవిచూడక తప్పదు. ఎన్డీఎస్ఏ (National Dam Safety Authority) సిఫార్సుల మేరకు పనులు చేపట్టాలని ఎల్అండ్ టీ కి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ ఇప్పటికే లేఖ రాశారు. కానీ.. పునరుద్ధరణ పనులకు అయ్యే ఖర్చెంతో నిర్థారణ చేసి.. అందుకు అనుబంధంగా ఒప్పందం చేసుకోవాలని సదరు నిర్మాణ సంస్థ కోరుతోంది. వర్షాకాలం ప్రారంభం కాగానే.. ప్రాణహితకు వరద వస్తుంది. ఆ సమయంలో బ్యారేజీకి నష్టం కలగకుండా ఉండాలంటే.. నీటిని పూర్తిగా వదిలేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జలసంఘ మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఉన్న కమిటీ సూచించింది.
Also Read: ఎవర్నీ వదలట్లేదు.. వెంటాడుతున్న మేడిగడ్డ!
ఏడో బ్లాక్ లో దెబ్బతిన్న 2 గేట్లను తొలగించి.. మరో 6 గేట్లలో ఏవైనా ఇబ్బందులుంటే చూసి సరిచేయాలి. వర్షాకాలంలో గేట్లన్నీ పైకెత్తి ఉంచేలా చర్యలు తీసుకోవాలి. మొన్నటి వరకూ పనులు చేసేందుకు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది. ఈలోగా అధికారులే పనులు ప్రారంభించాల్సింది. కానీ.. ప్రభుత్వమే ఖర్చులు భరించాలని ఎల్ అండ్ టి కచ్చితంగా చెప్తుండటంతో.. ఇప్పటి వరకూ తాత్కాలిక మరమ్మతు పనులు కూడా ప్రారంభం కాలేదు. బ్యారేజీని మళ్లీ మామూలు స్థితి తీసుకురావాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదేనని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ అంటుండగా.. ఖర్చు ప్రభుత్వానిదేనని నిర్మాణ సంస్థ చెబుతోంది. నిర్మాణ సంస్థే సొంత నిధులతో మరమ్మతు పనులు చేయని పక్షంలో చట్టప్రకారం చర్యలు చేపట్టి.. జరిగిన నష్టాన్ని వసూలు చేస్తామని చీఫ్ ఇంజినీర్ లేఖలో స్పష్టం చేశారు. ఏప్రిల్ 15న ఈ లేఖ రాయగా.. ఇప్పటి వరకూ నిర్మాణ సంస్థ చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశమైంది.