MK Meena Declared 81.86 Percent Polling in Andhra Pradesh: ఎట్టకేలకు ఎన్నికలు జరిగి దాదాపు 48 గంటల తర్వాత పోలింగ్ ఎంత అన్నదానిపై క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా. ఏపీ అంతటా 81.86 శాతం నమోదైనట్టు వెల్లడించారు.
బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ముకేష్కుమార్ మీనా.. గతంలో కంటే ఈసారి ఎక్కువగా పోలింగ్ నమోదయ్యిందన్నారు. 3500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం ఆరు తర్వాత కూడా పోలింగ్ జరిగిందన్నారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో అర్థరాత్రి రెండువరకు పోలింగ్ జరిగిందని వెల్లడించారు.
రీపోలింగ్పై అబ్జర్వర్లు ఏమీ చెప్పలేదన్నారు ముకేష్కుమార్ మీనా. వర్షం కారణంగా కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైందని, ఈవీఎంల ద్వారా 80.66 శాతం కాగా, బ్యాలెట్ ద్వారా 1.2 శాతం నమోదైందని వెల్లడించారు. ఈవీఎంలను 350 స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరిచామని తెలిపారు. నాలుగు దశలో ఏ రాష్ట్రం లోనూ ఈ స్థాయి పోలింగ్ జరగలేదని వెల్లడించారు.
Also Read: డిప్యూటీ సీఎం మాట, పోలీసులు పట్టించుకోవట్లేదట..
తాడిపత్రి,మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చాలా జరిగాయని తెలిపారు. ఆ నాలుగు ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టామని, అదనపు బలగాలు పంపించామన్నారు. అభ్యర్ధులందరినీ హౌస్ అరెస్టు చేయాలని అదేశాలిచ్చామని, ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని వెల్లడించారు. అలాగే ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. ఘటనలు అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తప్పవన్నారు.
అత్యధికంగా దర్శిలో 90.91శాతం కాగా, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం. కుప్పంలో 89.88 శాతం జరిగిందన్నారు. నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయన్న ఏపీ ఈసీ, అసెంబ్లీకి ఓటు వేసినవారు పార్లమెంటుకు వేయలేదన్నారు. లోక్సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, విశాఖలో అత్యల్పంగా 71.11 శాతం పోలింగ్ నమోదైనట్టు చెప్పుకొచ్చారు. అందులో పురుషులు 1,64,30,359 కాగా, మహిళలు 1,69,08,684, థర్డ్ జెండర్ 1517 మంది ఓటర్లు ఉన్నారు. 2014లో 78.90 శాతం కాగా, 2019లో 79.80 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఈసారి ఏకంగా దాదాపు 2.09 శాతం మేరా పోలింగ్ శాతం పెరగడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది.