IPL 2024 64th Match Delhi Capitals Won by 19 Runs Against Lucknow Super Giants: ఐపీఎల్ సీజన్ 2024 చివరికి వచ్చేసింది. ఈ సమయంలో ఢిల్లీతో జరిగిన కీలకమైన మ్యాచ్ లో లక్నో ఓటమి పాలైంది. నిజంగా గెలిచి ఉంటే 14 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లో సజీవంగా ఉండేది. ఎందుకంటే తను మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అది కూడా గెలిస్తే 16 పాయింట్లతో పోటీలోకి వెళ్లేది. ఇప్పుడా ఆశ పూర్తిగా పోయింది. ప్రస్తుతం 12 పాయింట్ల వద్దే ఆగిపోయింది. ఇంక ఆఖరి మ్యాచ్ కూడా ఓడిపోతే ప్రశాంతంగా ఇంటికి వెళ్లిపోవచ్చునని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇక టాస్ గెలిచిన లక్నో బౌలింగు తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో లక్నో 20 ఓవర్లలో 189 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 19 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
మ్యాచ్ వివరాల్లోకి వెళితే… 209 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నోకి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు డికాక్ (12), రాహుల్ (5) తక్కువ పరుగులకి అవుట్ అయిపోయారు. తర్వాత వచ్చిన వారు కూడా ప్రభావం చూపించలేదు. ఫస్ట్ డౌన్ వచ్చిన మార్కస్ స్టోనిస్ (5), దీపక్ హుడా (0) ఇలా వచ్చి అలా అయిపోయారు.
Also Read: SRH vs GT Match Today : గుజరాత్ కి చెలగాటం… హైదరాబాద్ కి ప్రాణ సంకటం
దీంతో 4.1 ఓవర్లలో 44 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి, దిక్కులేని పక్షిలా లక్నో విలవిల్లాడింది. ఈ పరిస్థితుల్లో ఒకడొచ్చాడు. నికోలస్ పూరన్ ఇరగకుమ్మేసి వదిలాడు. 27 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 61 పరుగులు చేసి వెళ్లిపోయాడు. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఆయుష్ బదోనీ (6) తను క్రీజులో ఎక్కవసేపు ఉండలేదు.
ఆ తర్వాత మళ్లీ అర్షద్ ఖాన్ 33 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి అందరిలో ఆశలు నింపాడు. కానీ కాసేపటికి అవుట్ అయిపోయాడు. తర్వాత యుధ్వీర్ సింగ్ (14) కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ పని కాలేదు. చివరికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగుల వద్ద లక్నో ఆగిపోయింది. 19 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఢిల్లీ బౌలింగులో ఇషాంత్ శర్మ 3, ఖలీల్ అహ్మద్ 1, అక్షర్ పటేల్ 1, ముఖేష్ 1, కులదీప్ యాదవ్ 1, త్రిస్టన్ స్టబ్స్ 1 వికెట్లు పడగొట్టారు.
Also Read: RR vs PBKS IPL 2024 Highlights: పంజాబ్ కింగ్స్ గెలుపు.. రాజస్థాన్కు వరుసగా నాలుగో ఓటమి
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ 33 బంతుల్లో 4 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత షాయ్ హోప్ (33) ఫర్వాలేదనిపించాడు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్ (33) తను ఒక మోస్తరుగా ఆడి వెళ్లాడు.
అనంతరం వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం దుమ్ము దులిపాడు. 25 బంతుల్లో 4 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తనకి మద్ధతుగా అక్షర్ పటేట్ నిలిచాడు. 14 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. మొత్తానికి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
లక్నో బౌలింగులో అర్షాద్ ఖాన్ 1, నవీన్ ఉల్ హక్ 2, రవి బిష్ణోయ్ 1 వికెట్ పడగొట్టారు.