RCB Playoffs Scenario in IPL 2024: అనూహ్యంగా ఆర్సీబీ వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచి ప్లే ఆఫ్ రేసులోకి వెళ్లింది. అయితే తనింకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ ఇంకో మ్యాచ్ గెలిస్తే, అప్పుడు14 పాయింట్లతో ముందడుగు వేస్తుంది. అదొక లెక్క. కాదు ఆఖరి మ్యాచ్ ఓడిపోతే ఇంకే గొడవా ఉండదు. చక్కగా ముంబయి పక్కన కూర్చోవచ్చు.
ఆర్సీబీ వేసుకుంటున్న లెక్కలన్నింటికి చిక్కుముడులు విడిపోవాలంటే…తను మరో మ్యాచ్ గెలవాల్సి ఉంది. అప్పుడే వీటన్నింటికి అర్థం, పరమార్థం…ఉంటుంది. మొదట్లో ఆర్సీబీ 8 మ్యాచ్ లు ఆడి ఒకే ఒక దాంట్లో గెలిచింది. 7 మ్యాచ్ ల్లో ఘోరంగా ఓటమి పాలైంది. కానీ అనూహ్యంగా పుంజుకుంది. అంతే వరుసపెట్టి 5 మ్యాచ్ ల నుంచి గెలుస్తూ వెళుతోంది. ప్రస్తుతం రన్ రేట్ కూడా మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.
దీనంతటికి కారణం ఏమిటంటే ఆర్సీబీలోకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ స్వప్నిక్ సింగ్ రావడమేనని కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంటున్నాడు. తనని జట్టులోకి తీసుకువచ్చిన తర్వాత బౌలింగు విభాగం బలోపేతమైందని అన్నాడు. వరుసపెట్టి వికెట్లు తీస్తున్నాడని తెలిపాడు. దాంతో మిగిలిన బౌలర్లపై ఒత్తిడి తగ్గిందని తెలిపాడు.
Also Read: 12 లో ముగ్గురు, 14లో ఇద్దరు.. ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కి వెళ్లేదెవరు?
అంతేకాదు సిరాజ్ కూడా టచ్ లోకి వచ్చాడని తెలిపాడు. ప్రస్తుతం మా బౌలింగ్లో వైవిధ్యంగా ఉందని అన్నాడు. గత రెండు, మూడు మ్యాచ్ల్లో యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్ అద్భుతంగా ఆడారని తెలిపాడు. ఫియర్లెస్ గేమ్తో సమష్టి ప్రదర్శన కనబరుస్తూ విజయాలు అందుకోవాలని అనుకుంటున్నాం.’అని తెలిపాడు.
ఇప్పుడు ఆర్సీబీ ఆడాల్సిన ఆఖరి మ్యాచ్ చెన్నయ్ సూపర్ కింగ్స్ తో ఆడనుంది. ఇది చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే చెన్నయ్ చాలా బలమైన జట్టు, రుతురాజ్ కెప్టెన్సీలో పడిపోయి మళ్లీ లేచింది. బలమైన ధోనీ అండదండల ముందు ఆర్సీబీ ఆటలు సాగుతాయా? లేదా చూడాలి. శనివారం 18న మ్యాచ్…ఈ రెండు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కి ప్రారంభం కానుంది. అప్పుడే ఆర్సీబీ జాతకం ఎలా ఉందో తెలుస్తుంది. ఆ తర్వాత ఎపిసోడ్ లో లెక్కలు, రన్ రేట్, పాయింట్లు అన్నీ తెరపైకి వస్తాయి.