AP Elections 2024: ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా ఎన్నికల ప్రచారం శనివారం సాయత్రం 6 గంటలతో ముగిసింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం ప్రాంతాల్లో ప్రచారం సాయంత్రం 4 గంటలకే ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాలైన కురుపాం, పాలకొండ, సాలూరులో సాయంత్రం 5 గంటలకే ప్రచారానికి తెరపడింది.
దాదాపు రెండు నెలల పాటు జరిగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. హోరా హోరీగా సాగిన ప్రచారం పోలింగ్ కు 48 గంటల ముందు ముగిసింది. దేశ వ్యాప్తంగా మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థులు ఏప్రిల్ 25 నుంచి నామినేషన్లు దాఖలు చేసుకోగా..26 న నామినేషన్ల పరిశీలన, 29 వరకు విత్ డ్రా కు అవకాశం కల్పించారు. అనంతరం అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. అధికార వైసీపీ, కాంగ్రెస్, కూటమిగా ఏర్పడ్డ టీడీపీ, బీజేపీ, జనసేన విస్తృత ప్రచారం నిర్వహించాయి.
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ కు ముందు ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ రోజు 6 గంటల నుంచి ఎలాంటి రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించకూడదు. సాయంత్రం ప్రచార పర్వం ముగియడంతో అధికారులు పోలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు కూడా ప్రచారం పోలింగ్ పై దృష్టి పెట్టారు.
రేపు పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ తెలిపారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఓటింగ్ ప్రక్రియ కొనసాగేందుకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: ఎన్నికల వేళ జగన్కు షాక్.. విజయమ్మ సంచలన వీడియో
తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెర పడింది. చివరి రోజు ప్రచారాలతో అభ్యర్థులు హోరెత్తించారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల కోసం మొత్తం 525 మంది పోటీ చేస్తున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ నుంచి 45 మంది బరిలో దిగారు. ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.