KCR comments on Congress Govt(Telangana politics): కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాలుగైదు నెలల్లోనే రాష్ట్రం రూపు రేఖలను మార్చేశారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రం దివాళా తీసిందని చెప్పడం సరికాదన్న ఆయన.. ఇప్పుడు ప్రజల ఆలోచన మారిందన్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో కనిపించిన జోష్.. ఇప్పుడు కనిపించడం లేదని జోస్యం చెప్పారు. ప్రభుత్వం భేషజాలకు వెళ్లి చాలా నష్టపోయిందన్నారు.
వైఎస్సార్ హయాంలో అమలు చేసిన ఆరోగ్యశ్రీని, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ను.. తామూ కొనసాగించామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ కోతలు పెరిగాయని, నీటి కొరత ఏర్పడిందని ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంగా అభివర్ణించారు. గత తొమ్మిదేళ్లలో లేని కరెంట్ కోతలు, నీటి ఎద్దడి ఇప్పుడు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. ఒకసారి తాను ఉన్న ప్లేస్ లోనే కరెంట్ కట్ అయితే.. ట్వీట్ చేశానన్న కేసీఆర్.. ప్రభుత్వం పట్టించుకోదని పదే పదే చేయడం మానేసినట్లు చెప్పారు. తాను వెళ్లిన 7-8 ప్రాంతాల్లో కరెంట్ కట్ అయిందని పేర్కొన్నారు.
Also Read : మతాల, కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుంది: సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా కరెంట్ ఇచ్చిన తెలంగాణలో ఇప్పుడు కరెంట్ కోతలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. సింగరేణిలో బొగ్గు కొరత లేదు, నీటి కొరత లేదు, ఎలాంటి కొరత లేకుండా కరెంట్ కట్ ఎందుకు కట్ అవుతుందని మీడియా ముఖంగా ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో 6-7 గంటలు కరెంట్ కట్ చేశారని వాపోయారు. ప్రగతి, పెట్టుబడులు, ఐటీ కంపెనీల తీరుతెన్నులు గమనించి హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ చేశానని, న్యూయార్క్ లో లండన్ లోనైనా పవర్ పోద్దేమో గానీ.. హైదరాబాద్ లో పవర్ పోదనే స్థాయికి తీసుకొచ్చానని.. మళ్లీ హైదరాబాద్ కు పవర్ కట్స్ మొదలయ్యాయని చెప్పుకునే స్థాయికి కాంగ్రెస్ తీసుకొచ్చిందని విమర్శించారు.
కరెంట్ లేక లక్షల ఎకరాల్లో పంట నష్టం, మోటార్లు కాలిపోవడం దురదృష్టకరమన్నారు. రైతులు కూడా కరెంట్ షాక్ లు తగిలి మరణించారు. మంచినీటి సరఫరా వ్యవస్థ కూడా పాడైందని వాపోయారు కేసీఆర్. ప్రతి వేసవిలో తెలంగాణలో మంచినీటి ఇబ్బంది ఉండకూడదని మిషన్ భగీరథను తీసుకొచ్చాం. వీధి కుళాయిలు లేకుండా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చాం. దొంగతోపు వంటి గూడెంకు కూడా నీటిని సప్లై చేశాం. వాటర్ బిజినెస్ ఆగింది. 3-4 నెలల్లో మళ్లీ మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. దూరప్రాంతాల నుంచి బిందెలు మోస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగైదు నెలల్లోనే.. కరెంట్ సరిగ్గా లేదు, మంచినీటి సరఫరా లేదు. మరి ప్రభుత్వం ఏం చేసిందని కేసీఆర్ నిలదీశారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కాపాడలేకపోయింది. 9 ఏళ్లుగా ఉన్నవి ఇప్పుడు ఏమయ్యాయని అడిగారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని నిలబెట్టకపోగా.. మళ్లీ ప్రజల జీవితాలను తొమ్మిదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందని దుయ్యబట్టారు.