Will Sujana Chaudhary win in Vijayawada West Constituency : రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలను చూసొచ్చిన లీడర్ సుజనాచౌదరి .. కేంద్ర మంత్రిగా పనిచేసి బీజేపీ అగ్రనాయకత్వానికి సన్నిహితుడు అయిన ఆయన.. ఇటు ఏపీలో చంద్రబాబుకు కూడా ఆప్తులే.. అలాంటి నాయకుడు బెజవాడ వెస్ట్ సెగ్మెంట్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. విభిన్నమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా అడుగుపెట్టడానికి ముందు నుంచే అక్కడి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారాయన్న అభిప్రాయం వినిపించింది. మరి ప్రచార గడువు ముగుస్తున్న టైంకి మాజీ కేంద్రమంత్రి పరిస్థితిపై వినిపిస్తున్న టాక్ ఏంటి?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం.. వన్టౌన్ని తనలో ఇముడ్చుకుని ఉన్న ఆ సెగ్మెంట్ వల్లే బెజవాడకు వ్యాపార రాజధాని అన్న పేరు వచ్చింది. హోల్సేల్ వ్యాపారానికి పెట్టింది పేరైన అక్కడ రాజకీయ చైతన్యం ఎంత ఎక్కువో సమస్యలు కూడా అన్నే కొలువుదీరి కనిపిస్తాయి. క్లాస్, మాస్ కలిసి ఉండే ఆ సెగ్మెంట్లో ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగా ఉంటుంది. 1967 నుంచి ఇప్పటికి 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అయిదుసార్లు గెలుపొందింది. కామ్రెడ్లు మూడు సార్లు జెండా పాతారు.. పీఆర్పీని కూడా ఆదరించిన వన్టౌన్ ఓటర్లు .. వైసీపీకి రెండు సార్లు పట్టం గట్టారు.
టీడీపీ ఆవిర్భవించాక 1983లో ఒక్కసారే విజయవాడ వెస్ట్లో టీడీపీ గెలిచింది. ఆ క్రమంలో కొన్ని సార్లు కామ్రెడ్లు, ఈ తర్వాత బీజేపీతో పొత్తులతో టీడీపీకి అక్కడ పోటీ చేసే అవకాశం పెద్దగా దక్కలేదు. అలాంటి చోట ఈ సారి మిత్రపక్షాల అభ్యర్ధిగా బీజేపీ నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనాచౌదరి బరిలోకి దిగడంతో ఇప్పుడా సెగ్మెంట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ముస్లీం ఓటర్లు గణనీయంగా ఉన్న వెస్ట్లో కాషాయ జెండాను ఎగరవేస్తానని ధీమాగా కనిపిస్తున్నారు సుజనా చౌదరి.
Also Read: కడపలో జగన్ కు షర్మిల చెక్ పెడుతుందా.?
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఈ సారి వెస్ట్లో గెలవడం అసాధ్యమని వైసీపీ సర్వేల్లో తేలింది. అందుకే ఆయన్ని జగన్ పక్కనున్న విజయవాడ సెంట్రల్కి మార్చారు. సెగ్మెంట్లో ముస్లీంలతో పాటు కీలకంగా ఉండే వైశ్య సామాజికవర్గానికి చెందిన వెల్లంపల్లి ఫ్యామిలీ ఆర్థికంగా స్థిరపడి వన్ టౌన్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్తోనే వెల్లంపల్లి శ్రీను ఒక సారి పీఆర్ఫీ నుంచి, రెండో సారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. జగన్ కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నా.. దూకుడు ప్రదర్శించడం ఆయనకు మైనస్ అయి సెగ్మెంట్ మారేలా చేసిందన్న అభిప్రాయం ఉంది.
ఈ సారి మాజీ కార్పొరేటర్ షేక్ ఆసిఫ్కు టికెట్ ఇచ్చింది వైసీపీ .. జూనియర్ అయిన ఆసిఫ్ని పిల్లోడిలా చూస్తున్నారంట వెస్ట్ వైసీపీ నేతలు .. దాంతో ప్రచారంలో ఒంటరి పోరాటం చేస్తున్న వైసీపీ అభ్యర్ధి సుజనాకు ఏ మాత్రం పోటీ ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. వెస్ట్ టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేత పోతిన మహేష్ ఇప్పుడు వైసీపీలోనే ఉన్నా.. ఆయన ఆసిఫ్కు మద్దతుగా ప్రచారం చేయడం మాని పదేపదే జనసేనానిని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు.
మరోవైపు టీడీపీ నుంచి వెస్ట్ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. ఇప్పుడు సుజనా చౌదరి విజయం కోసం చెమటోడ్చుతున్నారు. సెగ్మెంట్లో అందర్నీ పేరుతో పిలిచే చొరవ ఉన్న బుద్దా వెంకన్న ప్రచారం సుజనాకి అదనపు బలం అవుతుందంట. మరోవైపు మొన్నమొన్నటి దాకా వైసీపీలో కొనసాగిన వన్టౌన్ సీనియర్ లీడర్ పైలా సోమినాయుడు ఇప్పుడు సుజనాచౌదరి సమక్షంలో బీజేపీలో చేరి .. ఆయన విజయం కోసం పాటుపడుతున్నారు. విజయవాడ కౌన్సిల్లో కీలక పదవులు నిర్వహించిన పైలా ఇటీవల వరకు దుర్గగుడి పాలకమండలి చైర్మన్గా సేవలందించారు. బీసీ వర్గానికి చెందిన ఆయనకు వెస్టె సెగ్మెంట్లో కొండ ప్రాంతాలపై నివాసం ఉండే ఆయా వర్గాల్లో మంచి పట్టు ఉంది. పోతిన మహేష్పై ఆగ్రహంతో ఉన్న సదరు వర్గీయులు కూడా ఇప్పుడు సొమినాయుడు వెంట నడుస్తున్నారంట.
ఇక వంగవీటి అభిమానులకు కొదవలేని పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేత వంగవీటి రాధా ప్రచారం సుజనాకు మరింత కలిసి వస్తుందంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ సుజనాచౌదరి ఈ ఎన్నికల్లో తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ వర్గాల నాయకులతో భేటీ అవుతూ.. వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వైశ్యసామాజికవర్గం, ముస్లీం నేతలు ఇప్పటికే సుజనాకు మద్దతు ప్రకటించారు .. టీడీపీ కీలక నేతలు ఎంకే బేగ్తో పాటు ఆయన కుమారుడు, మరో సీనియర్ నేత నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్లు ఆ సెగ్మెంట్లో ముస్లీంలకు పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారంతా సుజనాకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
Also Read: తుది దశకు ప్రచారాలు.. ఓటర్లకు ప్రలోభాల ఎర.?
కృష్ణా జిల్లా వాసి అయిన సుజనాచౌదరి .. విజయవాడ వెస్ట్అభ్యర్ధిగా బరిలో దిగడాన్ని దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని .. ఇక్కడ ఇక్కడ ప్రజలకు సేవలందించేందుకే భగవంతుడు పంపాడనుకుంటున్నానని చెప్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచమంతా తిరిగి వచ్చిన తాను దేశరాష్ట్ర రాజకీయాలు చూసానని.. వెస్ట్లో కొండ ప్రాంత సమస్యలు తన కళ్లు తెరిపించాయని సూర్య చంద్రులున్నంతవరకు విజయవాడ వెస్టుకు సేవలందిస్తానని హామీ ఇస్తున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరిస్తానంటున్న సుజానా .. ఈ ఎన్నికలలో తనను కమలం గుర్తుపై , ఎంపీ అభ్యర్ధి కేశినేని చిన్నిని సైకిల్ గుర్తుపై గెలిపిస్తే అభివృద్ది, సంక్షేమం ఎలా ఉంటయో చూపిస్తామని భరోసా ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి డివిజన్ లో కార్యాలయం ఏర్పాటు చేసి.. ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడతానని మైనారిటీ మహిళలు సొంతంగా ఎదిగేలా రుణాలు ఇప్పిస్తానని .. ప్రతిభ ఉన్న మైనార్టీ విద్యార్దుల ఉన్నత చదువులకు వెళ్లేలా సాయం అందిస్తానని ముస్లీంలను ఆకట్టుకుంటున్నారు. మరి ఈ సారి విజయవాడ వెస్ట్ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.