మతాల మధ్య కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నయని ఆయన తెలిపారు. పటాన్ చెరు కార్నర్ మీటింగ్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు సీఎం రేవంత్.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మెదక్ కాంగ్రెస్ అభ్యర్ధి నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పటాన్ చెరు ఒక మినీ ఇండియా అని అభివర్ణించారు. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారన్నారు. పటాన్ చెరు అభివృద్ధి కావాలంటే నీలం మధును గెలిపించాలని కోరారు. ఒక్క పటాన్ చెరు అసెంబ్లీ నియెజకవర్గంలోనే 50 వేలకు పైగా మెజార్టీ ఇవ్వాలని సీఎం ప్రజలను కోరారు.
ఇక బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇప్పటికే ఒక పదవి ఉందని అయినా కూడా ఇంకొకటి అవసరమా అని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై ఫైర్ అయ్యారు. మందిన ముంచిన సొమ్ముతో ఈ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి గెలవాలని చూస్తున్నారన్నారు. వందల ఎకరాలు ఆక్రమించుకున్నారని సీఎం తెలిపారు.
సుప్రీం కోర్టులో ముదిరాజులకు సంభందించిన అంశం పెండింగ్ లో ఉందన్నారు. ముదిరాజ్ బిడ్డను గెలిపిస్తే ఆ పని దగ్గరుండి చూసుకుంటారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే నీలం మధు ఢిల్లీలో ఉండాలని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు సీఎం.
Also Read: జగన్కు సీఎం రేవంత్ కౌంటర్, ముందు ఫ్యామిలీ సంగతులు చూడండి..
పటాన్ చెరు కార్నర్ మీటింగ్కు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ, మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, పటాన్ చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.