Man kills Family and Shot Himself : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం వారిని హత్య చేసిన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో వెలుగుచూసింది. రాంపూర్ – మథుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్హాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనపై సీతాపూర్ ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనురాగ్ సింగ్ (45) మానసికంగా కుంగిపోయి.. మద్యానికి బానిసయ్యాడు. డ్రగ్స్ కు అలవాటుపడ్డాడు. అతనితో డ్రగ్స్ మానిపించేందుకు డ్రగ్స్ రహిత కేంద్రానికి తీసుకెళ్లే విషయమై గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అనురాగ్ విచక్షణ కోల్పోయాడు. తుపాకీతో తల్లి సావిత్రి (65), భార్య ప్రియాంక (40), కూతురు అశ్విని (12), మరో కూతురు అశ్విని (10), కుమారుడు అద్వైత (6) పై కాల్పులు జరిపి హతమార్చాడు. ఆపై తనను తాను కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. కాల్పుల మోత, ఇంటి నుంచి పెద్దగా కేకలు వినిపించడంతో.. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని చూసే సరికి కుటుంబమంతా మరణించి ఉన్నారు.
వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం అనురాగ్ కుటుంబ సభ్యుల్ని హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం.. ఆధారాలను సేకరించే పనిలో పడింది. కుటుంబం హత్య, వ్యక్తి ఆత్మహత్యతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.