Kumari aunty Election campaigning: యూట్యూబ్ ద్వారా ఇటీవల ఆదరణ పొందిన ఫుడ్ స్టాల్ నిర్వాహకురాలు కుమారీ ఆంటీ ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏపీలోని గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి, మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఆమె ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కుమారీ ఆంటీ మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు.. దీంతో ఇక్కడ బ్రతకుదెరువు కష్టంగా మారింది.. ఈ క్రమంలోనే నేను పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ కు వలస వెళ్లాల్సి వచ్చింది’ అంటూ ఆమె పేర్కొన్నారు. తాను గతంలో చూసినట్టుగానే పరిస్థితి ఉంది తప్ప ఇక్కడ అభివృద్ధి అన్నదే జరగలేదన్నారు. కూటమికి చెందిన అభ్యర్థులను గెలిపించుకుంటే గుడివాడలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక్కడ సరైన వైద్యం అందకనే తన తండ్రి చనిపోయాడని, భవిష్యత్తులో అలా ఏ తండ్రికీ జరగకూడదంటూ ఆమె భావోద్వేగంతో పేర్కొన్నారు. గుడివాడలో అభివృద్ధే కాదు ఉపాధి అవకాశాలు కూడా లేవంటూ ఆమె పేర్కొన్నారు. రాము వంటి నేత అధికారంలో ఉంటే తమలాంటివారికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. తన స్వస్థలమైన గుడివాడలో ప్రచారం చేయడంతో తనకు గర్వంగా ఉందని.. గుడివాడ ప్రజల మంచిని ఆకాంక్షించే ప్రచారం చేస్తున్నానంటూ ఆమె పేర్కొన్నారు.
కాగా, కుమారీ ఆంటీ.. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఫుడ్ స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తుంది. అయితే, ఫుడ్ స్టాల్స్ వల్ల మాదాపూర్ లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆ ప్రాంతంలోని ఫుడ్ స్టాల్స్ ను తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఆ దిశగా ముందుకు వెళ్తున్న క్రమంలో కుమారి ఆంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమె ఆవేదనను గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో భారీగా వైరల్ అయ్యి ఆమె రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యింది. అంతేకాదు.. ఆ వీడియో సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ను తొలగించాలనే నిర్ణయం విషయంలో పునరాలోచన చేయాలంటూ పోలీసులకు సూచించిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ఎన్నికల వేళ మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు.
Also Read: బెజవాడను ముంచెత్తిన వాన.. నేడు కూడా..
అయితే, గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ నుంచి మరోసారి బరిలో ఉన్నారు. వరుసగా ఐదోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగానే ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇటు టీడీపీ తరఫున వెనిగండ్ల రాము బరిలో ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ పోటీ కీలకంగా మారింది.