Gujarat Titans vs Chennai Super Kings IPL 2024 Highlights: ఐపీఎల్ మ్యాచ్ లో ఈరోజు మరో సంచలనం చోటు చేసుకుంది. గుజరాత్ ఓపెనర్స్ శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరూ చెరో సెంచరీ చేసి ఔరా అనిపించారు. భారీ స్కోరు చేశారు. మొత్తానికి చాలా మ్యాచ్ ల తర్వాత విజయం సాధించారు.
చెన్నై మొదట టాస్ గెలిచి బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగు చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నయ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. 35 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయినా 4వ స్థానంలో నిలిచింది. గెలిచిన గుజరాత్ 8వ స్థానానికి ఎగబాకింది.
232 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై కి ఆరంభంలోనే ఊహించని షాక్ ల మీద షాక్ లు తగిలాయి. ఆజ్యింక రహానే (1) అవుట్ అయ్యాడు. తర్వాత రచిన్ రవీంద్ర (1) రన్ అవుట్ అయ్యాడు. రుతురాజ్ డక్ అవుట్ అయ్యాడు. 2.5 ఓవర్లలో 10 పరుగులకి 3 వికెట్లు కోల్పోయిన చెన్నై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
ఈ దశలో డేరి మిచెల్, మొయిన్ ఆలీ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ ఉన్నప్పుడు చెన్నై మ్యాచ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ 34 బంతుల్లో 3 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో 63 పరుగులు చేసిన మిచెల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికి 36 బంతుల్లో 4 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
14.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులతో పర్వాలేదన్నట్టుగానే అనిపించింది. ఆ సమయంలో వచ్చిన శివమ్ దుబె (21), రవీంద్ర జడేజా (11) నిలబడి ఉంటే పనయ్యేది. కానీ ఇద్దరు అవుట్ కావడంతో పరాజయం నిశ్చయమైంది. కానీ చివర్లో ధోనీ వచ్చి ధనాధన్ ఆడాడు. 11 బంతుల్లో 3 సిక్స్ లు, 1 ఫోర్ సాయంతో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
అప్పటికే సమయం మించిపోయింది. మొత్తానికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగుల వద్ద చెన్నయ్ పరుగు ఆగిపోయింది. దీంతో 35 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.
Also Read: ఐపీఎల్లో సంచలనం.. తొలి వికెట్కు రికార్డ్ భాగస్వామ్యం
గుజరాత్ బౌలింగులో ఉమేష్ యాదవ్ 1, సందీప్ వారియర్ 1, రషీద్ ఖాన్ 2, మోహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్స్ అద్భుతంగా ఆడారు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ధోనీ వికెట్ల వెనుక ప్రేక్షకుడిలా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంతకు ముందు అయితే ఇలా క్రీజులో పాతుకుపోతే బౌలర్లని మార్చేవాడు. అందుకు తగినట్టుగా ఫీల్డిండ్ సెట్ చేసేవాడు. ఇవేమీ చెయ్యడం లేదు. దీంతో కెప్టెన్ రుతురాజ్ తనకి తోచిన రీతిలో తను బౌలింగు ఇచ్చుకుంటూ వెళ్లిపోయాడు.
మొత్తానికి శుభ్ మన్ గిల్ 55 బంతుల్లో 6 సిక్స్ లు, 9 ఫోర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. తర్వాత సాయి సుదర్శన్ 51 బంతుల్లో 7 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. తర్వాత డేవిడ్ మిల్లర్ (16) నాటౌట్ గా నిలిచాడు. షారూఖ్ ఖాన్ (2) రన్ అవుట్ అయ్యాడు. మొత్తానికి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి గుజరాత్ 231 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇక చెన్నై బౌలింగులో తుషార్ దేశ్ పాండె 2 వికెట్లు తీశాడు.