Rain updates in AP: మండే ఎండలతో ప్రజలు ఇప్పటికే అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
విజయవాడలో శుక్రవారం రాత్రి గంటకుపైగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అదేవిధంగా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది. గుంటూరు, ఏలూరు, కృష్ణా, అనకాపల్లి, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, తిరుపతితోపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతంలో 79 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
మరో ఐదు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొన్నది. పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అయితే, పలు ప్రాంతాల్లో మాత్రం పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. కేరళ మీదుగా ఆవర్తన ప్రభావం కొనసాగుతుండడంతో ద్రోణి ఏర్పడే అవకాశముంది.. ఈ కారణంగానే రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారి సంఖ్య ఎంతంటే ?
విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కాకినాడ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్లా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ క్రమంలో ఇటు ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.