CM KCR: దారుణం. ఘోరం. విధుల్లో ఉన్న అటవీ అధికారిపై మూకుమ్మడిగా దాడి చేశారు గుత్తికోయలు. గొడ్డళ్లు, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా అటాక్ చేశారు. ఆ దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదమే ఇంతటి దారుణానికి కారణమైంది. యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ సీరియస్ గా స్పందించారు. అధికారులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి.
మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. రిటైర్ మెంట్ వయసు వచ్చే వరకు ఆయన కుటుంబానికి పూర్తి వేతనం అందించాలని.. ఫ్యామిలీలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని.. ఆ ఏర్పాట్లను మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డిలు చూసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.
మరోవైపు, పోడు భూముల వివాదమే ఈ ఘటనకు కారణం కావడంతో.. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏళ్లుగా పోడు వివాదం నడుస్తోందని.. అటవీ అధికారులు, గిరిజనుల మధ్య అనేక సార్లు ఘర్షణలు జరిగాయని.. అయినా సర్కారు ఇప్పటి వరకూ పోడు సమస్యలపై దృష్టి పెట్టకపోవడమే ఈ దారుణానికి కారణమంటూ తప్పుబడుతున్నారు. సీఎం కేసీఆర్ సైతం త్వరలోనే పోడు భూముల సమస్య పరిష్కరిస్తానంటూ పదే పదే చెబుతున్నారు కానీ, పట్టుంచుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ మృతికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.