Ayyappa: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ ఇది. విమానంలో శబరిమల వెళ్లే వారు ఇకపై తమతో పాటు ఇరుముడి తీసుకెళ్లవచ్చు. ఆ మేరకు అనుమతి ఇస్తూ బీసీఏఎస్ ఉత్తర్వులు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు లక్షల్లో ఉంటారు. 41 రోజుల పాటు అయ్యప్ప మాల వేసుకొని.. దీక్ష చేపట్టి.. జ్యోతి దర్శనం కోసం కేరళలోని శబరిమల వెళ్తుంటారు. బస్సులు, రైళ్లలోనే చాలా మంది వెళ్తుంటారు. విపరీతమైన రద్దీ దృష్ట్యా టికెట్లు దొరకని వారు.. అప్పటికప్పుడు విమానంలో వెళ్లాలని అనుకుంటారు. కాస్త ఆర్థిక వెసులుబాటు ఉన్నవాళ్లూ విమానంలో కేరళ వెళ్లాలని భావిస్తుంటారు. కానీ, ఇన్నాళ్లూ వారికి నిబంధనలు అడ్డుగా ఉండేవి.
ఇరుముడిలో ఉండే నెయ్యి, కొబ్బరికాయ, పూజ సామాగ్రికి మండే స్వభావం ఉంటుందని వాటిని ప్యాసింజర్లతో పాటు విమానంలోకి అనుమతించకపోయేవారు అధికారులు. అయితే, భక్తుల నుంచి డిమాండ్లు వస్తుండటంతో తాజాగా నిబంధనలు సడలించారు.
భక్తులు తీసుకెళ్లే ఇరుముడిని ఇకపై క్యాబిన్లో తమతోపాటే తీసుకు వెళ్లవచ్చని విమానయాన శాఖ సూచించింది. విమానాశ్రయంలో తనిఖీలు పూర్తైన తర్వాత వీటిని తీసుకెళ్లేందుకు భక్తులకు అనుమతిస్తామని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బీసీఏఎస్ వెల్లడించింది. ఆ మేరకు అన్ని విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సర్క్యులర్ జారీ చేసింది.
అయితే, ఈ సదుపాయం కొంత కాలం వరకే అమలులో ఉండనుంది. మండలం, మకరజ్యోతి దీక్షలు పూర్తయ్యే జనవరి 20వ తేదీ వరకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని బీసీఏఎస్ స్పష్టం చేసింది.