ఇటీవల జరిగిన T20 వరల్డ్కప్ను ఇంగ్లండ్ గెలుచుకుంది. క్వాలిఫైయింగ్ మ్యాచ్లు పూర్తయ్యాక… సూపర్-12లో భాగంగా గ్రూప్-1 నుంచి ఆరు జట్లు, గ్రూప్-2 నుంచి 6 జట్లు ఈ వరల్డ్కప్లో తలపడ్డాయి. ఇక నెక్ట్స్ T20 వరల్డ్కప్ 2024లో జరగనుంది. అయితే ఇటీవలి T20 వరల్డ్కప్లా కాకుండా… 2024 T20 వరల్డ్కప్లో ఏకంగా 20 జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్త ఫార్మాట్లో జరగబోయే 2024 T20 వరల్డ్కప్ వివరాల్ని ICC వెల్లడించింది.
రెండేళ్ల తర్వాత జరగబోయే T20 వరల్డ్కప్ కోసం ICC ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఏకంగా 20 జట్లు తలపడే మెగా టోర్నీ కోసం… సుదీర్ఘ ఫార్మాట్ రూపొందించింది. మొత్తం 20 జట్లు… 4 గ్రూపులుగా విడిపోతాయి. ఒక్కో గ్రూపులో 5 జట్లు ఉంటాయి. ఈ నాలుగు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు… అంటే మొత్తం 8 జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. అసలు సిసలు పోరు ఇక్కడి నుంచే మొదలవుతుంది. సూపర్ 8 దశలో- ఒక్కో గ్రూపులో 4 జట్ల చొప్పున… రెండు గ్రూపులు ఉంటాయి. ఈ రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు… సెమీఫైనల్ బెర్త్ దక్కుతుంది. సెమీఫైనల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్లో తలపడి… ఒక జట్టు ఛాంపియన్ అవుతుంది.
వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చే 2024 T20 వరల్డ్కప్లో పాల్గొనే 20 జట్లలో ఇప్పటికే 12 జట్లు ఏంటనేది ఖరారైపోయింది. ఆతిథ్య దేశాలుగా విండీస్, USA తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇటీవలి T20 వరల్డ్కప్లో టాప్ 8 జట్లకూ మెగా టోర్నీలో చోటు దక్కింది. ఇక ICC T20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకూ స్థానం దొరికింది. మిగిలిన 8 జట్లను… క్వాలిఫైయింగ్ మ్యాచ్ల ద్వారా ఎంపిక చేస్తారు. T20 ర్యాంకుల్లో వెనుబడ్డ జింబాబ్వే, ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్ లాంటి జట్లు క్వాలిఫైయింగ్ రౌండ్లలో తలపడి 2024 T20 వరల్డ్కప్కు అర్హత సాధించాల్సి ఉంటుంది.