ట్విట్టర్ మస్క్ చేతుల్లోకి వచ్చాక తీవ్ర గందరగోళం ఏర్పడటంతో… యూజర్లలో చాలా మంది ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. మాస్టోడాన్, స్కై, కూ లాంటి మైక్రోబ్లాగింగ్ యాప్లకు మారిపోతున్నారు. వీటిల్లో మన దేశానికి చెందిన ‘కూ’… ఇప్పటికే 5 కోట్ల డౌన్లోడ్లతో ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపయోగించే రెండో మైక్రోబ్లాగింగ్ యాప్గా అవతరించి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ మిలియన్ల కొద్దీ డౌన్లోడ్స్తో ‘కూ’ కుమ్మేస్తోంది. బ్రెజిల్లో రెండు రోజుల్లోనే 10 లక్షల డౌన్లోడ్స్ అయ్యాయంటే… ట్విట్టర్ అంటే యూజర్లు ఏ స్థాయిలో విసిగిపోయి ఉన్నారో అర్థమవుతోందంటున్నారు… నెటిజన్లు.
ట్విట్టర్ దివాళా తీసే పరిస్థితులు ఉన్నాయని స్వయంగా కొత్త బాస్ మస్కే చెబుతూ ఉండటంతో… దానికి పోటీగా మార్కెట్లో పాతుకుపోవాలని వివిధ సోషల్ మీడియా యాప్స్ ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే దేశీయ మైక్రోబ్లాగింగ్ యాప్ ‘కూ’… వివిధ దేశాల్లో సర్వీసులు ప్రారంభిస్తోంది. రెండు రోజుల కిందట బ్రెజిల్లో ‘కూ’ సేవలు మొదలవగానే… 48 గంటల వ్యవధిలో ఏకంగా పది లక్షల డౌన్లోడ్స్ అయ్యాయి. ఎలాంటి రుసుములు వసూలు చేయబోమని ప్రకటించడం, సేవల్లో నాణ్యత ఉన్నందువల్లే ‘కూ’కు ఆదరణ పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం బ్రెజిల్లో ‘కూ’ డౌన్లోడ్స్ 20 లక్షలు దాటిపోయాయి. 10 లక్షల లైక్స్ కూడా వచ్చాయి. అక్కడి యూజర్లకు పోర్చుగీసు భాషలో ‘కూ’ను అందుబాటులోకి తెచ్చామని… అందుకే డౌన్లోడ్స్ పెరుగుతున్నాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మిగతా దేశాల్లోనూ స్థానిక భాషల్లో ‘కూ’ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు. మస్క్ టేకోవర్ తర్వాత ట్విట్టర్ యూజర్లు తగ్గిపోతున్నారన్న అంచనాల నేపథ్యంలో… దానికి ప్రత్యమ్నాయంగా అమెరికాలోనూ పాగా వేసే ప్రయత్నాలు చేస్తోంది… కూ. అమెరికాలో త్వరలోనే సేవలను ప్రారంభించబోతున్నామని తెలిపాడు… కూ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ. నమ్మండి! ఇది మన క్షణం! రాక్ చేద్దాం… అమెరికాలో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ కూ గురించి చెప్పాలని అక్కడి NRIలకు పిలుపునిచ్చాడు… రాధాకృష్ణ. అమెరికాలోనూ ‘కూ’ సేవలు మొదలైతే… కుమ్మేయడం ఖాయమంటున్నారు… విశ్లేషకులు.