Marri Shashidharreddy : సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. చాలా బాధతో రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. పూర్తి వివరాలతో సోనియాగాంధీకి లేఖ రాశానని తెలిపారు.ఇటీవల ఢిల్లీలో మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని విమర్శలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా తీసుకుని మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ పరిస్థితుల్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
టీఆర్ఎస్ తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్..
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. అందుకే కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండలేకపోయానని తెలిపారు. తెలంగాణ బాగు కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.టీఆర్ఎస్ తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించారు. ఈ విషయం ప్రజల్లో బాగా పాతుకుపోయిందన్నారు. కాంగ్రెస్లో ఇప్పుడున్న పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ పార్టీ విఫలమైందని మండిపడ్డారు.
ఉత్తమ్కుమార్రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉన్న సమయంలో అన్ని ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయిందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. అయినా ఉత్తమ్ ను ఆరేళ్లపాటు కొనసాగించారని తెలిపారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్లుగా వ్యవహరించే వ్యక్తులు హైకమాండ్కు ప్రతినిధిగా ఉంటూ అందరినీ సమన్వయం చేయాలన్నారు.తప్పులు,లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలని తెలిపారు. కానీ కాంగ్రెస్లో డబ్బు ఇచ్చే వాళ్ల మాటే చెల్లుతుందని మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు.