Tsunami Warning : పసిఫిక్ సముద్రంలో వరుస భూకంపాలు చోటు చేసుకొంటున్నాయి. సోమవారం ఇండోనేసియాలో భూకంపం పెనువిషాదాన్ని మిగిల్చింది. తాజాగా సాల్మన్ ద్వీపంలో భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
సాల్మన్ ద్వీపంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. భూకంప సమయంలో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. రాజధాని హోనైరికి ఆగ్నేయంగా దాదాపు 56 కిలోమీటర్ల దూరంలో 13 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. మరోవైపు సాల్మన్ ద్వీప పరిసర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
సముద్ర అలలు భారీగా ఎగసిపడే ప్రమాదం ఉందని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరించింది. అయితే భారీ స్థాయిలో సునామీ ఉండకపోవచ్చని తెలిపింది. ఈ భూకంపం మీటరు ఎత్తు అలలు సృష్టించే అవకాశం ఉందని ప్రకటించింది. పపువా న్యూగినియా, వనవాటు లాంటి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొని ఉండొచ్చని పేర్కొంది. సాల్మన్ ద్వీపం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. ఇక్కడ చాలా అగ్నిపర్వతాలు సముద్రం అడుగున ఉన్నాయి. ఆ అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భూకంపాలు సంభవిస్తాయి.
ఇండోనేసియాలోని జావాను సోమవారం భారీ భూకంపం అతలాకుతలం చేసింది. భూకంప కేంద్రమైన చియాంజుర్ ప్రాంతం తీవ్రంగా ధ్వంసమైంది. 162 మంది ప్రాణాలు కోల్పోయారని జావా గవర్నర్ రిద్వాన్ కమిల్ తెలిపారు.