Vijayasaireddy : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్నీ తమ కుటుంబ కంపెనీలా మార్చేశారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు వస్తున్నాయి. 2019లో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన 4 నెలలకు జరిగిన ఏసీఏ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోనూ ఎపెక్స్ కౌన్సిల్ పదవులన్నీ ఎంపీ బంధుగణం, ఆయన అనుచరులకే దక్కబోతున్నాయి. శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అరబిందో సంస్థ డైరెక్టర్ శరత్చంద్రారెడ్డికి ఏసీఏ అధ్యక్ష పదవి, అల్లుడు రోహిత్రెడ్డికి ఉపాధ్యక్ష పదవి, విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, విశాఖకు చెందిన వ్యాపారవేత్త గోపీనాథ్రెడ్డికి కార్యదర్శి పదవి, మిగతా పదవులు మరికొందరు అనుచరులకు.. ఇలా ఏసీఏ ఎన్నికల ప్రక్రియ ముగియకముందే పదవుల పందేరం జరిగిపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతి పదవికి ఒక నామినేషనే దాఖలైంది. ఇక ఎన్నిక లాంఛనమే. నామినేషన్ వేసినవారందరూ మరో మూడేళ్లపాటు ఏసీఏ పదవుల్లో కొనసాగుతారు. ఎన్నికల అధికారిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రమాకాంత్రెడ్డిని నియమించడం వివాదస్పదమైంది. మరోవైపు విశాఖను సీఎం జగన్ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించగానే విజయవాడ నుంచి ఏసీఏ కార్యాలయాన్ని విశాఖకు తరలించేశారు. మంగళగిరి సమీపంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని గత మూడేళ్లుగా ఏసీఏ ఉద్దేశపూర్వకంగానే పూర్తి చేయలేదన్న ఆరోపణలున్నాయి.
ఏసీఏపై పట్టు..
ఐపీఎల్ మొదలయ్యాక రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు బీసీసీఐ నుంచి వచ్చే నిధులు పెరిగాయి. ప్రస్తుతం ఏటా రూ.40 కోట్లకుపైగా నిధులు వస్తున్నాయి. గతంలో ఏసీఏలో బీజేపీ నేత గోకరాజు గంగరాజు హవా కొనసాగింది. 2019లో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక గోకరాజు వర్గం వైదొలగింది. 2019 సెప్టెంబర్ 22న జరిగిన ఎన్నికల్లో విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ సీపీలో చేరిన వెంకటగిరి రాజా కుటుంబానికి చెందిన వి.వి.ఎస్.ఎస్.కె.కె.యాచేంద్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్కు చెందిన దుర్గాప్రసాద్ కార్యదర్శిగా, అదే అసోసియేషన్కు చెందిన కె.ఎస్.రామచంద్రరావు సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వారిద్దరూ గోకరాజు వర్గానికి చెందినవారు. అయితే వారిని కొన్నాళ్లకే బయటకు పంపేశారని విమర్శలున్నాయి. కోశాధికారిగా విజయసాయిరెడ్డికి సన్నిహితుడు, దసపల్లా భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అష్యూర్ కంపెనీ డైరెక్టర్ గోపీనాథ్రెడ్డి ఎంపికయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉన్న ధనుంజయరెడ్డి అప్పట్లో ఏసీఏ సభ్యుడిగా పనిచేశారు.
పదవులన్నీ వారికే
ప్రస్తుత ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు రెండూ విజయసాయిరెడ్డి తమ కుటుంబ సభ్యులతోనే నింపేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్ష పదవికి శరత్చంద్రారెడ్డి పోటీ పడుతున్నారు. ఉపాధ్యక్ష పదవికి విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్రెడ్డి రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు కోశాధికారిగా ఉన్న గోపీనాథ్రెడ్డిని కార్యదర్శిగా చేస్తున్నారు. కోశాధికారిగా ఎంపిక కానున్న ఆడిటర్ ఎ.వి.చలం.. గోపీనాథ్రెడ్డికి సన్నిహితుడని సమాచారం. విజయవాడకు చెందిన వ్యాపారవేత్త రాకేశ్ సంయుక్త కార్యదర్శిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఏసీఏ ప్రస్తుత సీఈవో శివారెడ్డితో సత్సంబంధాలున్నాయని సమాచారం. కౌన్సెలర్గా పోటీ చేస్తున్న పురుషోత్తం గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డికి సన్నిహితుడట. ప్రస్తుతం సీఈవోగా ఉన్న వెంకటశివారెడ్డి వైఎస్ఆర్ సీపీ నాయకుడే. వైయస్ఆర్ జిల్లాకు చెందిన ఆయన గతంలో ఎమ్మెల్సీగా పని చేశారు. ప్రస్తుత శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆయన మేనమామ. గతంలో ఏసీఏలో సీఈవో పోస్టు లేదు. 2019లో కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత ఆ పోస్టును సృష్టించి శివారెడ్డిని నియమించారు.